AI Assistant : కృత్రిమ మేథ (ఏఐ) రాకతో కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తాయనే ఆందోళన నడుమ ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఓ స్వీడిష్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ బాంబు పేల్చింది. మాస్ లేఆఫ్స్ ప్రకటించిన ఏడాది తర్వాత చావు కబురు చల్లగా చెప్పింది.
తమ ఏఐ అసిస్టెంట్తో 700 మంది ఉద్యోగులను రీప్లేస్ చేశామని ఫిన్టెక్ కంపెనీ క్లార్నా వెల్లడించింది. 700 మంది ఫుల్టైం ఉద్యోగుల పనిభారాన్ని తమ ఏఐ అసిస్టెంట్ చక్కదిద్దుతుందని పేర్కొంది. ఏడాది కిందట ఇదే సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో కంపెనీ విమర్శలు ఎదుర్కొన్న నేపధ్యంలో ఏడాది తర్వాత ఈ విషయాన్ని క్లార్నా వెల్లడించడం గమనార్హం.
మాస్ లేఆఫ్స్ సందర్భంగా ఆర్ధిక అనిశ్చితి వాతావరణం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని అప్పట్లో క్లార్నా సీఈవో సెబాస్టియన్ సీమియతోవ్స్కీ చెప్పుకొచ్చారు. అయితే ఆ పరిస్ధితిని సీఈవో ఎదుర్కొన్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వేటుకు గురైన పలువురు ఉద్యోగుల పేర్లతో కూడిన జాబితాను ఆయన లింక్డిన్లో షేర్ చేయడం కలకలం రేపింది. అయితే గతంలో ఉద్యోగులను తొలగించిన దానితో ఏఐ అసిస్టెంట్ సామర్ధ్యానికి సంబంధం లేదని క్లార్నా వివరణ ఇచ్చింది.