న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఒకప్పటి తమ పాపులర్ మోపెడ్ లూనాను సరికొత్తగా మార్కెట్కు పరిచయం చేయబోతున్నది కినెటిక్ గ్రూప్. ఈసారి ఎలక్ట్రిక్ మోడల్ను తీసుకురానున్నది. ఈ మేరకు కినెటిక్ ఇంజినీరింగ్ సోమవారం తెలియజేసింది.
కినెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ నుంచి త్వరలోనే ఎలక్ట్రిక్ లూనా వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ లూనా కోసం చాసిస్, మెయిన్ స్టాండ్, సైడ్ స్టాండ్, స్వింగ్ ఆర్మ్ వంటి ఇతర కీలక భాగాల తయారీని కినెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ మొదలుపెట్టింది కూడా. నెలకు 5వేల సెట్లు ఉత్పత్తి చేస్తున్నది.
‘ఈ-లూనా నేపథ్యంలో వచ్చే 2-3 ఏండ్లలో ఏటా రూ.30 కోట్లకుపైగా వ్యాపారం పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. విద్యుత్తు ఆధారిత (ఈవీ) వాహన పరిశ్రమలో కినెటిక్ వాటా కూడా పెరుగుతుందని భావిస్తున్నాం’ అని కినెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఎండీ అజింక్య ఫిరోడియా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త అవతారంలో లూనా చాలామందిని ఆకర్షించగలదన్న విశ్వాసాన్ని కనబర్చిన ఆయన గతంలో గరిష్ఠంగా రోజుకు 2వేలకుపైగా లూనాలను అమ్మినట్టు గుర్తుచేశారు. మార్కెట్లో 95 శాతం వాటా లూనాదేనన్నారు. ఇక 50 ఏండ్ల క్రితం లూనాను మార్కెట్లో విడుదల చేశామని, అప్పుడు ధర రూ.2,000లుగా ఉందని చెప్పారు.