Kia Motors Record | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపూర్లో కొలువుదీరిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ మరో మైలురాయిని దాటింది. హిందూపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఐదు లక్షల కార్లను విపణిలోకి పంపినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో నాలుగు లక్షల కార్లను దేశీయంగా విక్రయిస్తే, మరో లక్ష కార్లు విదేశాలకు ఎగుమతి చేసింది. కియా కార్లు 91 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2019 సెప్టెంబర్ నుంచి సెల్టోస్ మోడల్ కార్లు ఎగుమతి చేస్తున్నది కియా మోటార్స్.
యుటిలిటీ వాహనాలను ఎగుమతి చేయడంలో దేశంలోనే తొలి స్థానాన్ని చేరుకున్నామని కియా మోటార్స్ వెల్లడించింది. గతేడాది కార్ల విక్రయాల్లో తమ కంపెనీ వాటా 25 శాతం. కేవలం రెండున్నరేండ్లలోనే ఈ ఘనత సాధించామని తెలిపింది.
సరికొత్త ఫీచర్లతో ఇటీవల వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన కియా కరెన్స్తో తదుపరి మైలురాళ్లను వేగంగా చేరుకుంటామని సంస్థ భారత్ సీఈవో తేజిన్ పార్క్ తెలిపారు. ఈ నెల 15న విపణిలో విడుదలైన కరెన్స్ మోడల్ కారుకు అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు.