హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ కైరోస్ టెక్నాలజీస్.. హైదరాబాద్లో కొత్తగా కే-ల్యాబ్ను ఏర్పాటు చేయబోతున్నది. రూ.120 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో సుధాకర్ పెన్నం తెలిపారు. శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో కంపెనీ భవిష్యత్తు ప్రణాళిక, విస్తరణ కార్యకలాపాలను వివరించారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ఇక్కడే ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ నూతన ల్యాబ్ను అత్యాధునిక సాంకేతికతో మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సును మిళితం చేసి సరికొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కంపెనీ నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం సంస్థలో 1,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..ఈ సరికొత్త ల్యాబ్ కోసం కొత్తగా 400 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించారు. 2022లో సంస్థ ఆదాయం 85 మిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి 150 మిలియన్ డాలర్లకు పెంచుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు డల్లాస్, కెనడా, మెక్సికో, దక్షిణాఫ్రికాతోపాటు హైదరాబాద్, వైజాగ్లలో కార్యాలయాలు ఉన్నాయి.