హైదరాబాద్: విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. సాధారణ పౌరుడికి కూడా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారని, ఆ దిశగా సరలీకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2024 వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలో విమాన ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారని చెప్పారు. దానికి తగినట్లుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. గత రెండేండ్లలో విమాన ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్లకు పెరిగిందన్నారు.
2047లో భారతదేశ విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గత పదేండ్లలో ఎంతో ప్రగతి సాధించామని వెల్లడించారు. ముంబై, ఢిల్లీలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. దేశంలో మరిన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు నిర్మించాల్సి ఉందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిపాడ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. దేశంలో 15 శాతం మహిళలు పైలట్లు, కెప్టెన్లుగా ఉన్నారని, ఇది ప్రపంచంలోనే అధికమన్నారు. ప్రస్తుతం డ్రోన్లకు ఎంతో డిమాండ్ పెరిగిందని, ఈనేపథ్యంలో డ్రోన్ మహిళ పైలట్లను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.