Air Tickets | విమాన ప్రయాణ టికెట్ల ధరలపై ఒక వ్యవస్థకు ప్రాణం పోయాలని కేంద్రం భావిస్తున్నది. నిత్యం విమాన టికెట్ల ధరలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.. ఇందుకు ఒక మెకానిజం రూపొందించాలని దేశీయ విమానయాన సంస్థలకు హితవు చెప్పింది. గత నెలలో స్వచ్ఛంద దివాళా పరిష్కార పక్రియ పిటిషన్ దాఖలు చేయడంతో నేలకు పరిమితమైన ‘గోఫస్ట్’ విమాన సర్వీసులు నడిచే మార్గాల్లో టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయి. ఈ సంగతిని గుర్తించిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ప్రత్యేకంగా ‘గోఫస్ట్’ గతంలో నడిపిన రూట్లలో టికెట్ల ధరలు అధికంగా ఉండటంపై విమానయాన సంస్థలతో చర్చించారు. విమాన ప్రయాణ టికెట్ల ధరలను ఆయా ఎయిర్ లైన్స్ యాజమాన్యాలే పర్యవేక్షించాలని సూచించారు. హై ఆర్బీడీ (రిజర్వేషన్ బుకింగ్ డిజిగ్రేటర్)కి లోబడి సదరు యంత్రాంగం ఉండాలని అభిప్రాయ పడ్డారు. హై ఆర్బీడీపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మానవతా ద్రుక్పథంతో వ్యవహరిస్తూ టికెట్ల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
విమాన ప్రయాణ టికెట్ల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవని, వాటి పెరుగుదల వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని గత మార్చిలో లోక్ సభలో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. టికెట్ల ధరల రూపకల్పన, నియంత్రణ ప్రభుత్వం చేయబోదన్నారు. అంతర్జాతీయ పద్దతులకు అనుగుణంగా టికెట్ల ధరలపై విమానయాన సంస్థలు నిర్ణయానికి వస్తాయన్నారు. డిమాండ్, సీజన్, ఇతర పరిస్థితులను బట్టి టికెట్ల ధరలు ఖరారవుతాయని తెలిపారు.