JSW Group | విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త సంవత్సరంలో అంటే 2022 జనవరి ఒకటో తేదీ నుంచి విద్యుత్ వాహనాలు కొనే తమ సంస్థ ఉద్యోగులకు భారీగా.. రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపింది. గ్రీన్ అండ్ క్లీన్ మొబిలిటీ ప్రోత్సాహకంలో భాగంగా జేఎస్డబ్ల్యూ.. నూతన ఎలక్ట్రిక్ వెహికల్స్ విధానాన్ని ఆవిష్కరించింది. ఉద్యోగుల కోసం భారత్ కార్పొరేట్ సంస్థ ఇటువంటి స్కీం ప్రకటించడం ఇదే తొలిసారి.
ఈ పథకం అమలు కోసం దీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి చెందిన దేశీయ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ (ఎన్డీసీఎస్) అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సినారియోస్ (Nationally Determined Contributions (NDCs) and Sustainable Development Scenarios (SDS) of The International Energy Agency (IEA) జత కట్టింది. ఈ పథకం అమలులో భాగంగా… విద్యుత్ ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసే జేఎస్డబ్ల్యూ ఉద్యోగులు… రూ. 3 లక్షల వరకు ప్రోత్సాహకాలు పొందొచ్చు.
జేఎస్డబ్ల్యూ కార్యాలయాలు, ప్లాంట్లలోని ఉద్యోగుల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లు కూడా కంపెనీ ఏర్పాటు చేయనుంది. 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్ అనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తమ ఉద్యోగులు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఈ తోడ్పాటునందిస్తున్నట్లు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా దేశంలో ఈవీ అడాప్షన్ పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.