న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ ఎగుమతులు మళ్లీ గాడిలో పడ్డాయి. గత నెలలో ఏకంగా 50 శాతం వృద్ధిని సాధించాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, జెమ్స్ అండ్ ఆభరణాల విభాగాలు ఆశాజనక పనితీరు కనబర్చడంతో ఎగుమతులు 49.85 శాతం పెరిగి 35.43 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు 46.40 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు(దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 10.97 బిలియన్ డాలర్లుగా నమోదైంది. చమురు దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 97 శాతం పెరిగి 12.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు(ఏప్రిల్ నుంచి జూలై వరకు) ఎగుమతులు 74.50 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 94 శాతం అధికమై 172.50 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.