న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశీయ ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా భారతీయ టాప్-5 ఐటీ సంస్థలు అవకాశం ఉన్నప్పుడల్లా ఉద్యోగుల్ని తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఏకంగా 23,460 మంది ఉద్యోగుల్ని తొలగించింది. టెక్ మహీంద్రా సైతం 1,108 మందిని తీసేసినట్టు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఫలితంగా ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ కంపెనీలు దాదాపు 18వేల మంది ఉద్యోగుల్ని నియమించుకున్నా.. టాప్-5 సంస్థల్లో నికరంగా ఉద్యోగులు సుమారు 7వేలు తగ్గినట్టే లెక్కల్లో తేటతెల్లమవుతున్నది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో హెచ్సీఎల్ టెక్ మినహా మిగతా అగ్రశ్రేణి కంపెనీలు ఉద్యోగ నియామకాలకు బదులుగా తొలగింపులకే ప్రాధాన్యతనిచ్చాయి. ఇన్ఫోసిస్ దాదాపు 26వేలు, విప్రో 24,500కుపైగా, టీసీఎస్ 13వేలకుపైగా ఎంప్లాయిస్ను తీసేశాయి. టెక్ మహీంద్రా సైతం సుమారు 7వేల ఉద్యోగులపై వేటు వేసింది. ఫలితంగా ఆ ఏడాది ఆయా కంపెనీల్లో నికరంగా ఉద్యోగుల సంఖ్య ఇంచుమించు 70వేలు పడిపోయింది. హెచ్సీఎల్ టెక్ కూడా స్వల్పంగా 1,537 మందినే నియమించుకున్నది. అయితే 2024-25లో మాత్రం హెచ్సీఎల్ టెక్ మినహా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఉద్యోగుల్ని తీసుకున్నాయి. వీటి ఉద్యోగుల సంఖ్య ఆ ఏడాది దాదాపు 13వేలు పెరిగింది. హెచ్సీఎల్ టెక్ 4వేలకుపైగా ఉద్యోగుల్ని తొలగించింది. కాగా, ఈ 5 సంస్థలు 2022-23లో దాదాపు 84వేలు, 2021-22లోనైతే 2.73 లక్షలకుపైగా మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం గమనార్హం.
దేశీయ ఐటీ రంగ సంస్థలకు విదేశీ మార్కెట్లోని ప్రాజెక్టుల నుంచే ఎక్కువగా ఆదాయం వస్తుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, దీనికి తగ్గట్టుగా క్లెయింట్లు నెమ్మదిగా తీసుకుంటున్న నిర్ణయాలు.. వ్యాపారావకాశాలను దెబ్బతీస్తున్నాయి. రాబడులు క్షీణిస్తున్నాయి. ఇక ఏఐ వినియోగం పెరుగడం కూడా ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలను మందగించేలా చేస్తున్నదన్న అభిప్రాయాలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.
బడా ఐటీ సంస్థలు ఉద్యోగ నియామకాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నా.. ఓవరాల్గా దేశీయ ఐటీ ఇండస్ట్రీలో మాత్రం ఉద్యోగుల పెరుగుదలే కనిపిస్తున్నది. దీంతో ఇప్పటికైతే ఇది సానుకూల అంశంగానే చూడాల్సి వస్తున్నది. ఇక ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 59 లక్షల ఐటీ ఉద్యోగులున్నట్టు నాస్కామ్ చెప్తున్నది. గడిచిన ఏడాది కాలంలో 1.4 లక్షలు పెరిగారు. అంతకుముందు ఏడాది కాలంలో 1.3 లక్షల ఉద్యోగులు పెరిగినట్టు ఈ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీల జాతీయ సంఘం తెలిపింది.