న్యూఢిల్లీ : దేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కల్పన ఆశాజనకంగా లేదని మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించన సర్వేలో వెల్లడైంది. రాబోయే నెలల్లో ఉపాధి కల్పన వేగం మందకొడిగా ఉంటుందని ఈ అథ్యయనం స్పష్టం చేసింది. రాబోయే త్రైమాసంలో సిబ్బంది సంఖ్యను పెంచేందుకు కేవలం కొద్ది కంపెనీలే మొగ్గుచూపాయి. మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్ మెంట్ అవుట్ లుక్ తాజా సర్వే 1303 మంది యజమానులను పలుకరించగా కేవలం 6 శాతం మందే జులై-సెప్టెంబర్ క్వార్టర్ లో అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటామని వెల్లడించారు.
ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తామని ఒక శాతం యజమానులు వెల్లడించగా, సిబ్బంది సంఖ్యలో ఎలాంటి మార్పులూ చేపట్టబోమని 49 శాతం మంది పేర్కొన్నారు. ఇక ఉద్యోగుల నియామకాలపై ఎలాంటి ఆలోచన లేదని 44 శాతం మంది స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలల్లో నియామకాల ప్రక్రియ స్థిరంగానే ఉంటుందని యజమానుల్లో అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు.
నియామకాల విషయానికి వస్తే రవాణా, సేవా రంగాల్లో నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ జాబ్ మార్కెట్ పై పెను ప్రభావం చూపిందని అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో నైపుణ్యాలతో కూడిన మానవవనరులకు డిమాండ్ క్రమంగా పెరగవచ్చని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి పేర్కొన్నారు.