JioBharat | రిలయన్స్ జియో ఆధ్వర్యంలో మార్కెట్లోకి వస్తున్న ‘జియోభారత్’ మరో సంచలనం కానున్నది. ఇప్పటి వరకు చౌకగా స్మార్ట్ ఫోన్లు సొంతం చేసుకోలేని వారికి ‘డిజిటల్ ఇండిపెండెన్స్ గేట్వేగా ‘జియోభారత్’ ఫోన్ నిలుస్తుందని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. సోమవారం జరిగిన రిలయన్స్ 46వ వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జియో భారత్ ఫోన్లలో ఇప్పుడు యూపీఐ ఫీచర్ ఉంటుందన్నారు.
‘యూపీఐ పేమెంట్స్కు జియో భారత్ మద్దతుగా ఉంటుంది. జియో భారత్ ఫోన్ కల వారిలో అత్యంత పేదలు సైతం ఇక క్యాష్ లెస్ చెల్లింపులు చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీలు చాలా ఈజీగా స్మూత్గా చేయొచ్చు. జియో భారత్ ద్వారా యూపీఐ పేమెంట్స్ను స్మాల్ మర్చంట్లు కూడా ఆమోదిస్తారు. చిన్న వ్యాపారాలకు సాధికారత లభిస్తుంది’ అని రిలయన్స్ జియో అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా వచ్చే జియో ఫోన్ 2.2 కోట్ల మందికి చేరువ అవుతుందని జెఫరీస్ ఇండియా విశ్లేషకులు అంటున్నారు.