Satilite Internet | దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో.. శుక్రవారం `జియో స్పేస్ ఫైబర్ సర్వీస్` ప్రారంభించింది. ఇది ఒక జీబీపీఎస్ సామర్థ్యం గల బ్రాడ్బాండ్ కనెక్టివిటీ అందిస్తుంది. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వేగంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యం. ఈ దశలో భారతీ ఎయిర్టెల్కు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పటిదాక టెలికం రంగంలో పోటీ కొనసాగింది. ఇక శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోనూ మొదలైందా.. జియో, ఎయిర్టెల్ పోటీ పడబోతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బ్రిటన్కు చెందిన వన్వెబ్తో జత కట్టిన భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్.. వచ్చే ఐదారేండ్లలో ఎలన్మస్క్ స్టార్లింక్, అమెజాన్ కూపియర్ మాత్రమే శాటిలైట్ బ్రాడ్బాండ్ సేవల్లో తమ వన్వెబ్కు పోటీ ఇస్తాయని వ్యాఖ్యానించారు. సునీల్ మిట్టల్ వ్యాఖ్యల నేపథ్యంలో `మమ్ముల్ని తక్కువ అంచనా వేయొద్దు` అంటూ రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ హెచ్చరించడం గమనార్హం. భారతీ ఎయిర్టెల్తోపాటు ఇతర సంస్థలను తక్కువ అంచనా వేయబోమన్నారు. కానీ సమీప భవిష్యత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో ఇతర సంస్థలు తమకు పోటీ ఇవ్వలేరని పేర్కొన్నారు.
భారతీ ఎయిర్టెల్ జత కట్టిన వన్వెబ్, రిలయన్స్ జియోతోపాటు భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఎలన్మస్క్ స్టార్లింక్, అమెజాన్ కూపియర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సునీల్ మిట్టల్ తెలిపారు. కానీ, భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది.
మరోవైపు, భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లగ్జెంబర్గ్ కేంద్రంగా పని చేస్తున్న శాటిలైట్ ప్రొవైడర్ ఎస్ఈఎస్తో రిలయన్స్ జియో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. తమ జాయింట్ వెంచర్కు స్పెక్ట్రం కేటాయించిన వెంటనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ పేర్కొన్నారు. గిగాబైట్ సామర్థ్యం గల ఎన్జీఎస్ఓ సేవలు అందించగల తమను ఇతర సంస్థలు ఇప్పట్లో ఢీకొట్టలేవని ధీమా వ్యక్తం చేశారు.