న్యూఢిల్లీ, జూలై 20: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్)కు స్టాక్ మార్కెట్ 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,66,000 కోట్లు) విలువను ఆపాదించింది. జేఎఫ్ఎస్ఎల్ డీమెర్జర్ నేపథ్యంలో గురువారం ఉదయం గంటపాటు ఆర్ఐఎల్కు స్టాక్ ఎక్సేంజీలు ప్రత్యేక ట్రేడింగ్ను నిర్వహించాయి. ఆర్ఐఎల్ షేరు క్రితం రోజు రూ.2,841.85 వద్ద, తాజాగా రూ.2,580 వద్ద ముగియడంతో ఈ రెండింటి వ్యత్యాసం రూ.261.85 జేఎఫ్ఎస్ఎల్ షేరు ప్రస్తుత మార్కెట్ విలువగా పరిగణించినట్టయ్యింది. దీని ప్రకారం 20 బిలియన్ డాలర్ల విలువతో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీలు) బజాజ్ ఫైనాన్స్ తర్వాత జేఎఫ్ఎస్ఎల్ నేరుగా ద్వితీయస్థానానికి చేరుకున్నది. తర్వాతి స్థానాల్లో పేటీఎం, చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర ఎన్బీఎఫ్సీలు ఉన్నాయి. అలాగే దేశంలో అత్యంత విలువగల భారతీయ కంపెనీల్లో 32వ స్థానాన్ని అందుకున్నది. షేర్ హోల్డర్లకు ఒక్కో ఆర్ఐఎల్ షేరుకు, ఒక్కో జేఎఫ్ఎస్ఎల్ షేరును ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో జేఎఫ్ఎస్ఎల్ షేర్లు ఎక్సేంజీల్లో ట్రేడ్ కానున్నాయి.