న్యూఢిల్లీ, జనవరి 13: వినియోగదారులకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 5జీ సేవలపై.. 4జీతో పోలిస్తే మరో 10 శాతం అదనపు చార్జీలను వసూలు చేసేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై-సెప్టెంబర్) మొత్తంగా మొబైల్ టారిఫ్లను కనీసం 20 శాతం మేర పెంచాలని యోచిస్తున్నాయి. అలాగే ప్రీమియం కస్టమర్లకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్లు ప్రస్తుతం అందిస్తున్న అన్లిమిటెడ్ 5జీ డాటా ప్లాన్లను ఉపసంహరించి, 2024 ద్వితీయార్థంలో 4జీ ప్లాన్లకు వసూలు చేస్తున్న టారిఫ్లకు 5-10 శాతం అదనంగా 5జీ ప్లాన్లకు ధరల్ని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. దాదాపు ఏడాదికాలంగా జియో, ఎయిర్టెల్లు 4జీ రేట్లకే 5జీ సర్వీసుల్ని అందించడంతో పాటు 4జీ వినియోగదారులు 5జీకి అప్గ్రేడ్ చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్లిమిటెడ్ 5జీ డాటాను సైతం ఆఫర్ చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 5జీ సర్వీసుల్ని ప్రవేశపెట్టడానికి, కస్టమర్లను సంపాదించుకోవడానికి చేసిన భారీ పెట్టుబడులకు తగిన రాబడుల్ని ఆర్జించేదిశగా జియో, ఎయిర్టెల్లు దృష్టి నిలిపాయని విశ్లేషకులు చెపుతున్నారు. 5జీ కవరేజ్ దాదాపు పూర్తికావొస్తున్నందున, అన్లిమిటెడ్ 5జీ డాటా ఆఫర్లను నిలిపివేసి, ఈ సర్వీసుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ప్రవేశపెడతాయని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెప్ఫెరీస్ ఒక రీసెర్చ్ నోట్లో వివరించింది. ఎయిర్టెల్, జియోలు 4జీకంటే 5-10 శాతం అదనపు ధరతో 5జీ ప్లాన్లకు విడుదల చేస్తాయని అంచనా వేసింది. అయితే అటువంటి ప్లాన్ల వైపు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు 30-40 శాతం డాటాను అదనంగా ఇచ్చే అవకాశం ఉన్నదని పేర్కొంది.
ప్రస్తుతం అధికశాతం వినియోగదారులు వాడుతున్న 4జీ సర్వీసుల ఛార్జీలను సైతం పెంచుతామంటూ పరిశ్రమ అధికారులు ఇప్పటికే సంకేతాలు ఇవ్వగా, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 20 శాతం వరకూ టారిఫ్లు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమకు యూజర్ల నుంచి వస్తున్న సగటు ఆదాయాన్ని (ఏపీఆర్యూ) పెంచుకోవడానికి సరైన సమయంలో మొబైల్ టారీఫ్లను అధికం చేయడానికి వెనుకాడబోమని ఇటీవల భారతి ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ చెప్పారు. ప్రస్తుతం రూ.200 ఉన్న ఏపీఆర్యూను రూ.250 వరకూ పెంచుకోవాలన్నది ఎయిర్టెల్ ప్రణాళిక. ఎయిర్టెల్, జియోలకు ఒక్కో చందాదారుకు టెలికం కంపెనీలు చేస్తున్న నెట్వర్క్ నిర్వహణా వ్యయం ఇప్పటికే రూ.66కు చేరుకున్నదని, 5జీ సర్వీసులతో ఇది మరింత పెరుగుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో టారీఫ్లు పెరగక తప్పదని అంచనా వేసింది.
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత టారిఫ్ల పెంపు కేంద్ర ప్రభుత్వానికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. వోడాఫోన్ఐడియాలో కేంద్రానికి 33 శాతం వాటా కూడా ఉన్నందున, 4జీ ప్లాన్ల ధరల పెంపును ప్రభుత్వం నిలువరించబోదని చెపుతున్నారు. భారత్లో మొబైల్ రంగ సంస్థల ఆదాయం రూ.2,77,300 కోట్ల(34 బిలియన్ డాలర్లు)కు చేరుకుంటుందని అంచనావేస్తున్నది. 2025-26 నాటికి ఇది రూ.3,07,800 కోట్లకు చేరుకోనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2,46,800 కోట్లుగా ఉన్నది. ఇతర సంస్థలు దూసుకుపోతుంటే వొడాఫోన్ ఐడియా మాత్రం నెమ్మదించింది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థ..5జీ సేవలు ఇప్పటికీ ప్రారంభించలేకపోయింది. దేశీయ టెలికం రంగం నుంచి వైదొలుగాలని కంపెనీ చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఒక్కప్పుడు డజన్కు పైగా ఉన్న టెలికం సంస్థలు నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తమ వ్యాపారాన్ని మూసివేశాయి కూడా.