Jet Airways | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని మూడేండ్ల క్రితం నేలకు పరిమితమైన జెట్ ఎయిర్వేస్ తిరిగి టేకాఫ్ తీసుకునే లోపే కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. త్వరలో విమాన సర్వీసులను ప్రారంభిస్తుందని భావిస్తున్న తరుణంలో బాంబు లాంటి వార్త పేల్చింది. 60 శాతం సిబ్బందిని సెలవుపై ఇండ్లకు పంపేయాలని నిర్ణయం తీసుకున్నది.
వారిలో సీనియర్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు కూడా ఉన్నారు. మూడు నెలల పాటు వీరిని సెలవులో వెళ్లాలని కోరింది. సెలవు కాలంలో వీరికి వేతనాలు చెల్లించబోదు. మిగతా ఉద్యోగులకు మాత్రం సగం వేతనం కోత విధించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని విశ్వసనీయ వర్గాల కథనం. కానీ, వేతనం లేని సెలవులో వెళ్లాలని ఆదేశించినట్లు వచ్చిన వార్తలు తప్పుడు సమాచారం అని సంస్థ సీఈవో సంజీవ్ కపూర్ ట్వీట్ చేశారు.
ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019లోనే నేలకు పరిమితమైంది. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకులు జెట్ ఎయిర్వేస్పై దివాళా ప్రక్రియ ప్రారంభించాయి. దీంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద జలాన్ కర్లాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ బిడ్ను గెలుచుకున్నది.
త్వరలో విమాన సర్వీసులను పునః ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో.. జలాన్ కర్లాక్ రివైవల్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ సంస్థ ఉద్యోగులు నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యూటీ బకాయిలు చెల్లించాలని కొత్త యాజమాన్యాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది.
దీంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం జెట్ ఎయిర్వేస్ స్వాధీన ప్రక్రియ నిర్ణీత సమయం కంటే ఎక్కువ టైం తీసుకుంటున్నదని నూతన యాజమాన్యం జలాన్ కర్లాక్ కన్సార్టియం ప్రకటించింది. ఎయిర్లైన్స్ భవితవ్యాన్ని కాపాడటానికి, నిధులు పొదుపు చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
అదేమిటో వెల్లడించకున్నా.. వేతనం లేని సెలవులు, శాలరీలో కోత వంటి నిర్ణయాలు అందులో ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే సూచనలు కనిపించడం లేదు. కొత్తగా విమానాల కొనుగోలు కోసం జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావట్లేదని సమాచారం.
కాగా, 60శాతం సిబ్బందిని మూడు నెలల పాటు వేతనం లేని సెలవుపై వెళ్లాలని ఆదేశించినట్లు వచ్చిన వార్తలపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ రియాక్టయ్యారు. సీనియర్ మేనేజ్మెంట్తోపాటు ప్రస్తుత ఉద్యోగుల్లో 60 శాతం మందిని మూడు నెలల పాటు వేతనం లేని సెలవులో వెళ్లాలని వచ్చిన వార్తలు “100శాతం తప్పుడు సమాచారం” అని ట్వీట్ చేశారు.