న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు సంస్థ నూతన యాజమాన్యం గట్టి షాక్ ఇచ్చింది. ప్రతి ఉద్యోగికి రూ.23 వేల పరిహారం చెల్లించడానికి సుముఖంగా ఉంది. నరేశ్ అగర్వాల్ సారధ్యంలోని జెట్ ఎయిర్వేస్ అప్పుల ఊబిలో చిక్కుకుని నేలకు పరిమితమైన సంగతి తెలిసిందే.
జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసేందుకు కల్రాక్-జలాక్లతో కూడిన జాయింట్ వెంచర్ యాజమాన్యం సమర్పించిన బిడ్ను బ్యాంకర్ల కన్సార్టియం ఆమోదించిన సంగతి తెలిసిందే.
దివాళా ప్రక్రియ క్రింద తమకు రూ.3 లక్షల నుంచి రూ.85 లక్షల పరిహారం చెల్లించాలని జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు క్లెయిమ్లు దాఖలు చేశారు. కానీ పునరుద్ధరణ ప్రణాళిక కింద ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.23 వేల పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
నూతన యాజమాన్యం సమర్పించిన పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించింది. అయితే, 95 శాతం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు వచ్చే మూడు నెలల్లో ఈ ప్రణాళికలను ఆమోదించాలని షరతు విధించింది.
కానీ, ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ, పీఎఫ్ తదితర చెల్లింపులతోపాటు పెండింగ్ చెల్లింపులపై ఎన్సీఎల్టీ ఎటువంటి ఆదేశాలు విధించలేదు. ఎన్సీఎల్టీ ప్లాన్కు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులపై ఓటేయాలని సంస్థ యాజమాన్యం కోరింది.
ప్రతి ఉద్యోగి తాము దాఖలు చేసిన క్లెయిమ్లో 0.5 శాతం మాత్రమే పరిహారం ఇవ్వాలని యోచిస్తున్నదని జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పవాస్కార్ చెప్పారు. వివాదం తేలకుంటే న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమన్నారు.