Jet Airways | అప్పుల ఊబిలో చిక్కుకుని గ్రౌండ్కే పరిమితమైన ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ సీఈవోగా సంజీవ్ కపూర్ శుక్రవారం తప్పుకున్నారు. 2022లో జెట్ ఎయిర్వేస్ సీఈవోగా నియమితులైనా అర్ధంతరంగా తప్పుకోవడం గమనార్హం. సీఈవోగా సంజీవ్ కపూర్ రాజీనామా చేయడానికి గల కారణాలు బయటికి రాలేదు. శుక్రవారమే సంజీవ్ కపూర్ చివరి వర్కింగ్ డే అని సంస్థ సంబంధిత వర్గాల కథనం.
ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం అప్పుల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు 2019లో నిలిచిపోయాయి. తర్వాత జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన బ్యాంకర్లు దివాళా ప్రక్రియలో ప్రారంభించారు. ఇందులో భాగంగా చేపట్టిన బిడ్డింగ్ను జలాన్-కర్లాక్ కన్సార్టియం గెలుచుకున్నది. అటుపై త్వరలోనే జెట్ ఎయిర్వేస్ సర్వీసులు మొదలవుతాయని భావించినా.. బ్యాంకర్లు, కన్సార్టియం మధ్య భిన్నాభిప్రాయాలతో జలాన్-కర్లాక్ కన్సార్టియంకు మేనేజ్మెంట్ బదిలీ ముందుకు సాగలేదు.
ఇంతకుముందు విస్తారా ఎయిర్లైన్స్, స్పైస్జెట్ వంటి సంస్థల్లో పని చేసిన సంజీవ్ కపూర్.. గతేడాది ఏప్రిల్ నాలుగో తేదీన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా నియమితులయ్యారు. జలాన్-కర్లాక్ కన్సార్టియంకు మేనేజ్మెంట్ హక్కులు బదిలీ అయ్యే వరకు ఆయన సీఈవోగా ఉంటారని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కానీ, అర్ధంతరంగా సంజీవ్ కపూర్ వైదొలిగారు. దీనిపై అటు సంజీవ్ కపూర్ గానీ, కన్సార్టియం గానీ స్పందించలేదు.