ముంబై : కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత ఆర్ధిక వ్యవస్ధ అనూహ్యంగా పుంజుకోవడంతో నియామకాలు ఊపందుకున్నాయి. మహమ్మారి తలెత్తినప్పటి నుంచి తొలిసారిగా నొముర ఇండియా బిజినెస్ రిజంప్షన్ సూచీ కరోనా ముందున్న పరిస్ధితిని సూచించడం రికవరీపై భరోసా నింపింది.
ఐటీ, నిర్మాణ రంగం సహా పలు రంగాలు రికవరీ బాటపట్టడంతో మళ్లీ కొలువుల కళ కనిపిస్తోంది. ఐటీ దిగ్గజ కంపెనీల నుంచి వస్తున్న సంకేతాల ఆధారంగా ఈ ఏడాది గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో టెకీల నియామకాలు ఉంటాయని వెల్లడవుతోందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జెఫ్రీస్ అంచనా వేసింది. ఐదు దేశీ ఐటీ దిగ్గజాలు ఈ ఏడాది తొలి త్రైమాసంలో 55,000 మందిని రిక్రూట్ చేసుకోగా ఈ ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి 1,50,000 మందిని నియమించుకోనున్నాయి. మరోవైపు ఉద్యోగులను కాపాడుకునేందుకు అట్రిషన్ రేటు పరిమిత స్ధాయికి తీసుకువచ్చేందుకు ఐటీ కంపెనీలు భారీ వేతన పెంపు, ప్రోత్సహకాలను ప్రకటిస్తున్నాయి.
ఏఐ, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీలపై నైపుణ్యాలున్న వారికి ఊహించని ప్యాకేజ్లను ఆఫర్ చేస్తున్నాయి. వేగంగా పదోన్నతులు, వేతన పెంపులను ఐటీ కంపెనీలు ప్రకటిస్తుండటం నగరాల్లో ఇతర అనుబంధ రంగాల వృద్ధికి దారితీస్తుండటంతో ఆయా రంగాల్లోనూ కొత్త కొలువులు అందుబాటులోకి రానున్నాయి.