హైదరాబాద్, అక్టోబర్ 4: ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల ప్రణాళికను అదాని గ్రూప్ ప్రకటించింది. వృద్ధి అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వచ్చే దశాబ్దకాలంలో గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 70 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5.2 లక్షల కోట్లు) పెట్టుబడి చేయనున్నట్లు అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని తెలిపారు. దేశీయ శ్రీమంతుల జాబితాలో ద్వితీయస్థానంలో ఉన్న గౌతమ్ అదాని సోమవారం హైదరాబాద్ జరిగిన టై సదస్సులో వర్చువల్గా మాట్లాడుతూ కేవలం పునరుత్పాదక ఇంధన రంగంలోనే 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తమ సౌర, పవన విద్యుదుత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్ తయారీ, ఏఐ ఆధారిత క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో భాగస్వాములతో కలిసి పెట్టుబడి చేస్తామని అదాని వివరించారు.
సౌర విద్యుదుత్పత్తి మూడు రెట్లు…
అదాని గ్రూప్ వచ్చే నాలుగేండ్లలో సౌర విద్యుదుత్పత్తిని ప్రస్తుతస్థాయి నుంచి మూడు రెట్లు పెంచుతుందని, ఈ విభాగంలో ప్రపంచంలో మరెక్కడా లేనంతటి వేగవంతమైన వృద్ధిరేటును సాధిస్తామని గౌతమ్ అదాని తెలిపారు. తమ గ్రూప్ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి 25 గిగావాట్లకు చేరిందని, ఈ లక్ష్యాన్ని అంచనాలకంటే నాలుగేండ్ల ముందుగానే చేరుకున్నామన్నారు. ఇదేతరహా వృద్ధి రేటుతో 2030 సంవత్సరానికల్లా ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీ తమదే అవుతుందన్నారు.
భారీ అవకాశాలు…
పర్యావరణ మార్పు కోసం ప్రపంచం చేపడుతున్న చర్యల కారణంగా గ్రీన్ ఎనర్జీలో ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడి అవకాశాలు ఏర్పడుతున్నాయని అదాని అన్నారు. అధిక సామర్థ్యంగల సౌర పలకలు, పవన టర్బయిన్లు, బ్యాటరీ టెక్నాలజీలు, ఆల్గోరిథిమ్తో పనిచేసే గ్రిడ్లు, హైడ్రోజన్ సంబంధిత టెక్నాలజీల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీల విప్లవం కారణంగా భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతి దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందన్న విశ్వాసాన్ని అదాని వ్యక్తంచేశారు. ముడి చమురు, సహజవాయువు, బొగ్గు దిగుమతుల్ని హైడ్రోజన్, సంబంధిత డెరివేటివ్స్ తగ్గించి వేస్తాయన్నారు.
ఏడేండ్లలోనే ఎన్నో పెను సవాళ్లకు చెక్
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో తెలంగాణ పరుగులు
టీఎస్ఎస్-2021 సదస్సులో జయేశ్ రంజన్
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కేవలం ఏడేండ్లలోనే తెలంగాణ అనేక పెను సవాళ్లను అధిగమించిందని పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దారుణంగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని చక్కదిద్ది ప్రగతి పథంలో పరుగులు తీయించడంతోపాటు కరవును జయించి వలసలను అరికట్టడం, పవర్ హాలిడేస్ను అధిగమించడం, అడవుల అభివృద్ధి, భూగర్భజలాల పెంపు లాంటి అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సోమవారం వర్చువల్గా ప్రారంభమైన టీఐఈ సస్టెయినబిలిటీ సమ్మిట్-2021 (టీఎస్ఎస్-2021)లో ఆయన మాట్లాడుతూ.. పచ్చదనం పెంపు ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు హరితహారం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలునాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మిషన్ కాకతీయలో భాగంగా 47,000 చెరువులను పునరుద్ధరించామని, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ లాంటి రంగాల అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు ప్రవేశపెట్టామని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల ఫలితంగా రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నాయని తెలిపారు. సుస్థిరాభివృద్ధి సాధనలో ప్రపంచ దేశాలకు కోస్టారికా, ఇజ్రాయిల్ ఆదర్శంగా నిలుస్తున్నాయని, అత్యుత్తమ పర్యావరణ ప్రమాణాలను పాటించడంలో కోస్టారికా ఎంతో ముందున్నదని ప్రశంసించారు. ఆయిల్ పామ్ సాగులో కోస్టారికాతో కలిసి ముందుకు సాగాలని తెలంగాణ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.