ITReturns | గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి 3.7 కోట్ల మంది ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేశారని కేంద్ర ఆర్థికశాఖ శనివారం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈ నెల 31 తుది గడువు. ఈ నెల 17 నాటికి ఆదాయం పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్లో 3,71,74,810 మంది ఐటీఆర్ దాఖలు చేశారని ఆదాయం పన్నుశాఖ పేర్కొంది. 2.12 కోట్ల మంది ఐటీఆర్1, 31.04 లక్షల మంది ఐటీఆర్2, 35.45 లక్షల ఐటీఆర్3, 87.66 లక్షల ఐటీఆర్4, 3.38 లక్షల ఐటీఆర్5, 1.45 లక్షల ఐటీఆర్6, 0.25 లక్షల మంది ఐటీఆర్7 పత్రాలు దాఖలు చేశారు. గత నాలుగేండ్లుగా ఐటీఆర్ దాఖలు చేసిన వారి వివరాలు తెలుసుకుందాం..
ఈ నెలాఖరులోగా ఐటీఆర్ దాఖలు చేయని వారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 వేల వరకు ఆ పెనాల్టీ విధిస్తారు. అయితే, వారి ఆదాయం రూ.5 లక్షలు దాటకుంటే లేట్ ఫీజుగా రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. గడువు దాటిన తర్వాత ఫైన్తో ఐటీఆర్ దాఖలు చేసే వారికి పలు మినహాయింపులు వర్తించవు. ఆదాయం పన్ను చట్టంలోని 10ఏ, 10బీ సెక్షన్ల కింద మినహాయింపు క్లయిమ్ చేసుకునే అవకాశం ఉండదు.
గడువు దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసే వారికి ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80ఐఏ, 80ఐఏబీ, 80ఐసీ, 80ఐడీ, 80ఐఈ సెక్షన్ల కింద మినహాయింపులు లభించవు. ఇంకా 80ఐఏసీ, 80ఐబీఏ, 80జేజేఏఏ, 80ఎల్ఏ, 80పీ, 80పీఏ, 80క్యూక్యూబీ, 80ఆర్ఆర్బీ సెక్షన్ల కింద డిడక్షన్లు కోరే అవకాశాన్ని కోల్పోతారు.
ఏడాది — — — దాఖలైన ఐటీఆర్లు
2016-17 — — 5.43 కోట్లు
2017-18 — — 6.49 కోట్లు
2018-19 — — 5.47 కోట్లు
2019-20 — — 5.95 కోట్లు