ITR filing | ఆదాయం పన్ను చెల్లిస్తున్న వారు సాధ్యమైనంత త్వరగా తమ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సర (2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెల 31 చివరి తేదీ. ఈ గడువు పొడిగించడానికి కేంద్రంగా సిద్ధంగా లేదని తెలుస్తున్నది.
గతేడాది కంటే ఎక్కువ మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారని భావిస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని ఆయన గుర్తు చేశారు. శరవేగంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వేతన జీవులు, పన్ను చెల్లింపు దారులకు సంజయ్ మల్హోత్రా ధన్యవాదాలు తెలిపారు.
గడువు పొడిగిస్తారని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి క్షణం వరకూ వేచి ఉండవద్దని టాక్స్ పేయర్లను మల్హోత్రా కోరారు. ‘జూలై 31 గడువు శరవేగంగా దూసుకొస్తున్నది. వేతన జీవులు సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని నేను అభ్యర్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఐటీ చెల్లింపుల్లో ఏడాది 10.5 శాతం గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేశారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుల్లో 12 శాతం గ్రోత్ ఉండవచ్చునన్నారు. ఎక్సైజ్ డ్యూటీ వసూళ్ల గ్రోత్ 12 శాతం లోపే ఉంటుందని అంచనా వేశారు.