ITR filing | 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు జూలై 31. వేతన జీవులు సమర్పించే ఐటీ రిటర్న్స్ అడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు తేదీ సమీపిస్తున్నది. ఈ దఫా గడువు పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తేల్చి చెప్పారు. కానీ, ఈ దఫా గడువు పొడిగించే విషయమై కేంద్రం పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేకించి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఊరట కల్పించేందుకు చాన్స్ ఉందంటూ పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో నవంబర్ 30 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగించారు. మరుసటి సంవత్సరం కూడా కొత్త ఐటీఆర్ పోర్టల్లో సాంకేతిక సమస్యలతో సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. గతేడాది 2021-22 ఆర్థిక సంవత్సర గడువు పొడిగించలేదు. కానీ, ఈసారి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పన్ను చెల్లింపు దారులు ఇబ్బందులు పాలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పన్ను చెల్లింపు దారులకు కేంద్రం ఊరట ఇచ్చే అవకాశం ఉందని సీఏలు చెబుతున్నారు. గుజరాత్ టాక్స్ అడ్వకేట్స్ అసోసియేషన్ సైతం గడువు పొడిగించాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. 15 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
సాంకేతిక సమస్యల వల్ల ఐటీఆర్ ఫైలింగ్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వేతన జీవులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.75 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని ఐటీ వెబ్ సైట్ గణాంకాలు తెలిపాయి. గతేడాది 7.4 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. గడువు దాటిన తర్వాత వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5000 ఆలస్య ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వేతన జీవులు తమ ఆదాయం రూ.5 లక్షల్లోపు ఆదాయం కల వారు రూ.1000 పే చేయాల్సి ఉంటుంది.