Moodys on Adani | స్వల్పకాలికంగా అదానీ గ్రూప్ సంస్థలు నిధులు సమీకరించుకోవడం కష్టం కావచ్చునని ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ మూడీస్ స్పష్టం చేసింది. వచ్చే ఒకటి, రెండేండ్లలో నిర్దేశిత ప్రాజెక్టులు చేపట్టేందుకు గానీ, రుణాల పునర్వ్యవస్థీకరణకు గానీ నిధుల సమీకరణ కష్ట సాధ్యం కావచ్చునని తెలిపింది. కొన్ని ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సేకరణ వాయిదా వేయొచ్చునని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అదానీ గ్రూప్ ద్రవ్య లభ్యతను అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. షేర్లలో అవకతవకలకు పాల్పడటంతోపాటు ఖాతాల్లోనూ మోసాలకు పాల్పడుతున్నదన్న హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
మరో రేటింగ్ సంస్థ ఫిచ్ సైతం స్పందిస్తూ.. అదానీ గ్రూప్ సంస్థలకు, వాటి బాండ్లపై తక్షణ ప్రతికూల ప్రభావం ఉండబోదని తెలిపింది. నిధుల అంశంలో తమ అంచనాల్లో ఎటువంటి మార్పులు ఉండబోవన్నది. స్వల్ప కాలికంగానూ విదేశీ మెచ్యూర్డ్ బాండ్లేమీ లేవని పేర్కొన్నది. ఎప్పటికప్పుడు అదానీ గ్రూప్ సంస్థల లావాదేవీలను, పరిణామాలను గమనిస్తున్నట్లు వెల్లడించింది.
గోల్డ్ మాన్ సాచెస్, జేపీ మోర్గాన్ చేజ్ వంటి సంస్థలు అదానీ గ్రూప్ సంస్థల నిధుల లభ్యతను బట్టి రుణాలు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ బాండ్ల విక్రయాలకు తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గోల్డ్ మాన్ సాచెస్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లు సమాచారం. ఇన్వెస్టర్ కాల్పై గోల్డ్ మాన్ సాచెస్ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. అదానీ గ్రూప్ సంస్థలకు మరికొంత కాలం సంక్షోభం తప్పదని గోల్డ్ మాన్ సాచెస్, జేపీ మోర్గాన్ భావిస్తున్నాయి. మరో క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిసిల్ సైతం అదానీ గ్రూప్ సంస్థల లావాదేవీలను పరిశీలిస్తున్నామని పేర్కొనడం గమనార్హం.