న్యూఢిల్లీ : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామకృష్ణ నివాసాలపై ఐటీ అధికారులు గురువారం దాడులు చేపట్టారు. ఎన్ఎస్ఈ కీలక సమాచారాన్ని అజ్జ్ఞాత వ్యక్తికి చేరవేస్తూ ఆమె అక్రమంగా లబ్ధి పొందారనే ఆరోపణలపై చిత్రా రామకృష్ణన్ విచారణను ఎదుర్కొంటున్నారు.
ఆనంద్ సుబ్రమణియన్ను చీఫ్ స్ట్రేటజిక్ అధికారిగా నియమించే క్రమంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) ఇటీవల చిత్రా రామకృష్ణకు రూ 3 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాలని సెబీ ఆమెను ఆదేశించింది.
మరోవైపు హిమాలయాల్లో నివసించే యోగి కనుసన్నల్లో తాను నడుచుకున్నానని చిత్రా రామకృష్ణ వివరణ ఇవ్వడంతో ఆ వ్యక్తి ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. మరోవైపు యోగి, చిత్రా రామకృష్ణ మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణలూ ఇటీవల వెలుగుచూశాయి.