న్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో వరుసగా రెండో రోజూ భారత్ స్టాక్ సూచీలు క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 54,053 పాయింట్ల వద్ద క్లోజ్కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట్లు తగ్గి 16,125 పాయింట్ల వద్ద నిలిచింది. అధిక ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు మందకొడిగా ట్రేడవుతున్నాయని, రూపాయి బలహీనత, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు స్థానిక సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెప్పారు. అమెరికా ఫెడ్ మీటింగ్ మినిట్స్ కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని, రానున్న రోజుల్లో వడ్డీ రేట్ల పెంపు దిశపై సంకేతాలు మినిట్స్లో వెల్లడైన తర్వాత కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవొచ్చని భావిస్తున్నారని కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఆసియాలో హాంకాంగ్, షాంఘై, సియోల్, టోక్యో సూచీలు నష్టాలతో ముగిసాయి. అలాగే యూరప్ సైతం భారీగా తగ్గాయి.
ఇన్వెస్టర్లు తాజాగా ఐటీ షేర్లను అధికంగా విక్రయించారు. ఈ క్రమంలో బీఎస్ఈ-30 షేర్లలో అన్నింటికంటే అత్యధికంగా టెక్ మహీంద్రా 3.92 శాతం తగ్గింది. హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్లు 1-3 శాతం మధ్య పడిపోయాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎంలు 1.8 శాతం వరకూ పెరిగాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ ఇండెక్స్ 1.75 శాతం నష్టపోగా, యుటిలిటీస్ సూచి 1.7 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.64 శాతం, పవర్ సూచి 1.64 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం తగ్గగా, మిడ్క్యాప్ సూచి 0.85 శాతం క్షీణించింది. ఇంధన ధరల తగ్గుదల, ఉక్కుపై ఎగుమతి సుంకాల్ని పెంచడంతో ఆటో రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయని, మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
భారత్ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నిధుల్ని వెనక్కు తీసుకుంటున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం సైతం నికర విక్రయాలు జరిపారు. మంగళశారం వీరు రూ. 2,393 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రితం రోజు రూ. 1,951 కోట్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.
మారిషస్కు చెందిన డీవీఐ ఫండ్ మంగళవారం రూ. 624 కోట్ల విలువైన జీఎంఆర్ ఇన్ఫ్రా షేర్లను విక్రయించింది. షేరుకు రూ.36.65 సగటు ధరతో 17.03 కోట్ల షేర్లను రెండు బ్లాక్ డీల్స్గా అమ్మినట్టు ఎన్ఎస్ఈ డాటా వెల్లడిస్తున్నది. ఈ లావాదేవీ విలువ రూ. 624.38 కోట్లు. ఈ షేర్లను ఏడీ ఇన్వెస్టర్స్ ఫండ్, సీడీ ఇన్వెస్టర్స్ ఫండ్, డెక్కన్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఫండ్, డీవీజీ 1740 ఫండ్ కొనుగోలు చేశాయి. జీఎంఆర్ ఇన్ఫ్రాలో 2021 డిసెంబర్ చివరినాటికి డీవీఐ ఫండ్ మారిషస్కు 7.76 శాతం వాటా ఉంది. తాజా బ్లాక్ డీల్స్ నేపథ్యంలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు రూ. 37.30 వద్ద ముగిసింది.