PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): 2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్’ అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతామని కొత్త రాగం అందుకొన్నారు. 2022 ముగియడమే కాదు 2023 కూడా సగం పూర్తయ్యింది. అయితే, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.5 ట్రిలియన్ డాలర్లు కూడా దాటలేదు. ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు విమర్శించడం ప్రారంభించాయి. దీన్ని గమనించిన ప్రధాని.. మరో కొత్త రాగం అందుకొన్నారు. ఎన్డీయే కూటమికి మూడోసారి పగ్గాలు అప్పగిస్తే.. భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని తాజాగా చెప్పుకొచ్చారు.
నిజంగా సాధ్యమా?
గడిచిన తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ఎన్నడూచూడని స్థాయిలో ద్రవ్యోల్బణం కట్టలుతెంచుకొన్నది. 35 ఏండ్లలో చూడని విధంగా నిత్యావసరాల వస్తువుల ధరలు 300 శాతం ఎగబాకాయి. 45 ఏండ్లలో చూడని విధంగా నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. నైపుణ్యానికి తగిన ఉద్యోగం లేనివారి సంఖ్య 22 కోట్లుగా తేలింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో కుదేలైన చిన్న పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందకపోవడంతో గడిచిన 9 ఏండ్లలో 10 లక్షల చిన్న, మధ్యస్థాయి కంపెనీలు మూతబడ్డాయి. ఎగుమతులు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఈ విషయాలన్నిటినీ బేరీజువేసుకుంటే.. మోదీ ఇచ్చిన మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ హామీ నీటిమూటేనని, ఓట్ల కోసమే ప్రధాని మరోసారి మాటల గారడీకి దిగారని విశ్లేషకులు చెబుతున్నారు.
జీడీపీ 6 శాతమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6 శాతం నుంచి 6.3 శాతంగా నమోదుకానున్నదని డెలాయిట్ ఇండియా అంచనావేస్తున్నది. ప్రపంచ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు తగ్గుముఖం పట్టనుండటంతో ఆ తర్వాత రెండేండ్ల వరకు జీడీపీ 7 శాతానికి ఎగబాకనున్నదని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ముప్పుతో ఈ ఏడాది అంతర్జాతీయంగా పలు దేశాలు ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోలేకపోతున్నాయని, ముఖ్యంగా అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభంతో వృద్ధి మందగించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులను గట్టెక్కడానికి పలు సెంట్రల్ బ్యాంకులు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాయని, దీంతో క్లిష్ట పరిస్థితులనుంచి గట్టెక్కాయని ఆర్థిక అవుట్లుక్లో పేర్కొంది.