హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్లో పుష్కలంగా ఉన్నాయని.. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్సహా పలు రంగాల అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన పరుగులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. ఐటీ కారిడార్ నానక్రాంగూడలో స్టెల్లాంటిస్ సంస్థ 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన డిజిటల్ హబ్ కార్యాలయాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఇందులో 700లకుపైగా వర్క్స్టేషన్స్, ఇన్నోవేషన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్స్కు సంబంధించిన భారీ ప్రాజెక్టును తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పేరుతో ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో స్టెల్లాంటిస్ భాగస్వామ్యం కావడంపట్ల ఆనందంగా ఉందన్నారు. ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అత్యంత కీలకమైన రంగంగా మారిందని, దాని కేంద్రంగా కొత్తగా ఆవిష్కరణలు, ప్రాజెక్టులు రావాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని స్పష్టంచేశారు. ఒకప్పటి ఆటో రంగంతో పోల్చితే నేటి ఆటోమొబైల్ రంగం చాలా ఆధునీకరణ చెందిందన్నారు. కంప్యూటర్ మీదే మొత్తం నడుస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు ఆధారిత ఆటోమొబైల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు వస్తున్నాయని, అందుకే తెలంగాణ మొబలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టెల్లాంటిస్ చీఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ క్రిస్టోఫర్ టేలర్, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సాఫ్ట్వేర్ డివిజన్) అనంత లక్ష్మణ్లతోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొత్తగా ఏర్పాటుచేసిన రైట్ సాఫ్ట్వేర్ అత్యాధునిక డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ ఓ కాంతిపుంజంలా దూసుకుపోతున్నదని, రాష్ట్రంలో ఉన్న సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం వల్లే ఇదంతా అన్నారు. పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడులకూ ఇదే కారణమన్నారు. నగరంలో ఉన్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదని, భారతీయ ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్లోనే వస్తోందంటే ఇక్కడున్న ప్రోత్సాహకర పరిస్థితుల్ని అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువతలో ఏదైనా సాధించాలనే పట్టుదల, కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటాయన్న ఆయన.. హైదరాబాద్, బెంగళూరువారితో పోల్చితే ఇంగ్లీష్ అంత అందంగా మాట్లాడలేకపోవచ్చుగానీ, వారిలో నైపుణ్యం, ప్రతిభకు కొదువ లేదన్నారు. అలాంటివారిని ప్రోత్సహించాలంటే వారిని హైదరాబాద్ రప్పించడం కాదు.. మనమే వారి దగ్గరకు వెళ్లాలని కంపెనీలకు సూచించారు. తెలంగాణ ప్రభు త్వం సైతం జిల్లా కేంద్రాల్లో ఐటీ కార్యకలాపాలు పెరిగేందుకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలను కల్పిస్తున్నదని తెలియజేశారు.