నగదుతో జ్యుయెల్లరీ షాపులకు పరుగులు తీస్తున్నారా?
జాగ్రత్త.. ఆదాయ పన్ను నిబంధనలపై అవగాహన లేకుండా ముందుకెళ్తే అనవసరపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి.
Rs.2000 Notes | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో చాలామంది నగదు (రూ.2000 నోట్లు)తో నగలను కొనేందుకు బంగారు ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు. అయితే ఆధార్ వంటి ఐడీ ప్రూఫ్, పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డులతో లేదా వాటి అవసరం లేకుండా ఒక వ్యక్తి ఎంతవరకు బంగారం కొనుగోలు చేయవచ్చో తెలుసా? కేంద్ర ప్రభుత్వం.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002 పరిధిలోకి రత్నాలు, ఆభరణాల రంగాన్ని తీసుకురావడం ద్వారా నగదుతో బంగారం కొనుగోళ్లకు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు 2020 డిసెంబర్ 28నే ఓ నోటిఫికేషన్ను కేంద్రం జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం నగదు లావాదేవీలు నిర్ణీత పరిమితి దాటితే కొనుగోలుదారు పాన్ లేదా ఆధార్ తదితర ఐడీ ప్రూఫ్లను దుకాణదారు తప్పక అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను సంబంధిత అధికారులకు తెలియపర్చాలి. అలాగే రూ.10 లక్షలు, ఆపై విలువ కలిగిన భారీ నగదు లావాదేవీల సమాచారాన్ని ప్రభుత్వానికి వెంటనే చేరవేయాలి.
నిర్దేశించిన పరిమితిని దాటి నగదు లావాదేవీలను ఆదాయ పన్ను (ఐటీ) చట్టాలు అనుమతించడం లేదు. ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం ఒక వ్యక్తి ద్వారాగానీ, ఒక లావాదేవీలోగానీ రోజుకు రూ.2 లక్షల వరకే నగదు లావాదేవీలు జరగాలి. ఆపై నగదు లావాదేవీలు నిషిద్ధం. కాబట్టి ఒకే రోజు రూ.2 లక్షలకుపైగా నగదుతో మీరు బంగారం లేదా బంగారు నగలు కొనలేరు. ఒకవేళ కొన్నైట్టెతే ఐటీ చట్టంలోని సెక్షన్ 271డీ ప్రకారం జరిమానా పడుతుంది. ఈ జరిమానా దుకాణదారే చెల్లించాల్సి ఉంటుంది. మీరు చేసిన లావాదేవీకి సమానంగా జరిమానా ఉంటుం ది. అంటే రూ.4 లక్షల నగదుతో మీరు నగలను కొంటే.. రూ.4 లక్షల జరిమానా చెల్లించాలన్నమాట. ఇలా ఎంత పెట్టి కొంటే.. అంతే పెనాల్టీ తప్పదు. కనుక జ్యుయెల్లర్స్ రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలను అంగీకరించరు.
ఐటీ నిబంధనలు 1962లోని 114బీ నిబంధన ప్రకారం రూ.2 లక్షలు, ఆపై విలువైన బంగారు ఆభరణాలను కొనాలనుకుంటే పాన్/ఆధార్ వివరాలను తప్పక తెలియపర్చాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. నగదు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులతో సంబంధం లేకుండా జ్యుయెల్లర్స్కు కొనుగోలుదారులు తమ పాన్/ఆధార్ వివరాలను ఇవ్వాల్సిందేనని ఖైతాన్ అండ్ కో న్యాయ సంస్థ భాగస్వామి శృతి గలియా చెప్తున్నారు. అలాగే రూ.2 లక్షలలోపు లావాదేవీలకు ఎవరికీ ఎటువంటి పాన్/ఆధార్ వివరాలను కొనుగోలుదారులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 269ఎస్టీ చెప్తున్నదని ఈ సందర్భంగా గలియా స్పష్టం చేశారు.