ముంబై, ఏప్రిల్ 12: ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని చేరుకోలేకపోయాయి. 2022-23 నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 16.9 శాతం వృద్ధిచెంది రూ. 59,162 కోట్లకు చేరింది. నికర లాభం 14.8 శాతం వృద్ధిచెంది రూ.11,392 కోట్ల వద్ద నిలిచింది. లాభం రూ.11,560 కోట్లు, ఆదాయం రూ.59,350 కోట్లు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్ 24.5 ఆపరేటింగ్ మార్జిన్లను సాధించింది. ఇది 25 శాతంగా మార్కెట్ అంచనా వేసింది. ఫలితాల్ని పరిగణనలోకి తీసుకునేందుకు బుధవారం సమావేశమైన బోర్డు షేరుకు రూ.24 చొప్పున తుది డివిడెండ్ సిఫార్సు చేసింది.
‘కంపెనీ సాధించిన పటిష్ట వృద్ధి చాలా సంతృప్తికరంగా ఉంది. మా ఆర్డర్ల వృద్ధి.. మా సర్వీసులకు ఉన్న డిమాండ్కు నిదర్శనం. మా స్టేక్హోల్డర్లు అందరికీ ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా, వచ్చే కొద్ది నెలల్లో నాయకత్వ బదిలీ సజావుగా జరిగేలా కృతి (కొత్త సీఈవో), నేను చూస్తున్నాం. భవిష్యత్తు అవకాశాలను టీసీఎస్ అందిపుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉంది’
-రాజేష్ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్
ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ కొత్తగా 821 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో వలసలు పోను నికరంగా 22,600 మంది ఉద్యోగులు చేరారని, తాము ఇచ్చిన జాబ్ ఆఫర్లు అన్నింటినీ గౌరవిస్తున్నట్టు టీసీఎస్ తెలిపింది. అలాగే 2022-23లో 44,000 మంది ఫ్రెషర్లను తీసుకున్నామని, అనుభవం కలిగిన నిపుణులను అత్యధిక స్థాయిలో నియమించుకున్నామన్నది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,795కు చేరింది.
టీసీఎస్ కొత్త సీఈవో, ఎండీగా కంపెనీ బోర్డు నియమించిన కృతివాసన్ ఈ ఏడాది జూన్ 1 నుంచి రాజేష్ గోపీనాథన్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. వ్యక్తిగత కారణాలతో గోపీనాథన్ రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.