న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆఫీసు నుంచే పనిచేయాలంటూ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులను కోరుతూ అందుకు మార్చి 31 తుది గడువు తేదీగా నిర్ణయించింది. గతంలో ప్రకటించిన గడువు ఇప్పటికే ముగిసిపోవడంతో దీనిని తాజాగా పొడిగించింది. దీనిని మరింత పెంచబోమని, ఇదే తుది గడువు అని స్పష్టం చేసింది. అప్పటికల్లా ఆఫీసుకు వచ్చి పనిచేయని ఉద్యోగులు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియం హెచ్చరించారు. పని సంస్కృతి, సెక్యూరిటీ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ అంశంపై తుది కమ్యూనికేషన్ను ఉద్యోగులకు పంపించామని తెలిపారు. ఇంటి నుంచి పనిచేయడం ఉద్యోగులు, యాజమాన్యానికి మంచిదికాదని, సైబర్ దాడుల రిస్క్ ఉంటుందని, నియంత్రణ కొరవడుతుందని, సెక్యూరిటీకి ముప్పు ఏర్పడుతుందని వివరించారు. కొవిడ్-19 తర్వాత కంపెనీ అమలు చేస్తున్న హైబ్రీడ్ మోడల్కు స్వస్తి పలకాలని టీసీఎస్ భావిస్తున్నది. అయితే ఉద్యోగులందరూ కార్యాలయాలకు తిరిగి వచ్చిన 2025 తర్వాత నాలుగో వంతు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉంటుందని గతంలో కంపెనీ ప్రకటించింది.