యావత్తు దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా అవతరిస్తున్నది. ముందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. వ్యాపార, పారిశ్రామిక విస్తరణకు బాటలు వేస్తున్నాయి. నలుదిశలా అభివృద్ధిని విస్తరింపజేస్తూపోతుండటంతో జిల్లా కేంద్రాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవే లేకుండాపోయిందిప్పుడు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హబ్ అండ్ స్పోక్ ఆఫీస్ నెట్వర్క్.. దేశవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆచరిస్తున్న విధానమిది. కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోంకు అలవాటుపడిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ఉద్యోగులు ఇప్పుడు కార్యాలయాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమ సమీప పట్టణాలు, నగరాల్లోనే ఉండి పని చేసేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు నిరాకరిస్తే రాజీనామాలకూ సిద్ధపడుతుండటం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ఇప్పుడు కంపెనీలు టైర్-2 నగరాల్లో తమ కార్యాలయాల విస్తరణపై ఫోకస్ పెట్టాయి.
కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఆరేడేండ్ల కిందటే ఈ హబ్ అండ్ స్పోక్ ఆఫీస్ నెట్వర్క్ (శాటిలైట్ ఆఫీసెస్)కు శ్రీకారం చుట్టింది. అంతేకాదు మొన్నటిదాకా హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లా కేంద్రాలకూ విస్తరింపజేసింది. తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్ల ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రభు త్వం.. ఇప్పటికే మూడు నగరాల్లో వాటిని అందుబాటులోకి తీసుకురాగా… మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. అంటే… ఎప్పట్నుంచో తెలంగాణ అమలు చేస్తున్నది! ఇప్పుడు దేశం ఆచరిస్తున్నదన్నమాట!!
మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలూ తమ విధానాలను మార్చుకుంటున్నాయి.
కరోనా మహమ్మారి తర్వాత దాదాపు రెండేండ్లేపాటు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను అమలు చేశాయి. అయితే పరిస్థితులు చక్కబడుతుండటంతో రిటర్న్ టు ఆఫీస్కు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. కానీ మెజారిటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నా ఆశించిన ఫలితం రావట్లేదు. చివరకు రాజీనామాలకూ ఉద్యోగులు సిద్ధపడుతున్నారు. దీంతో హబ్ అండ్ స్పోక్ ఆఫీస్ నెట్వర్క్పై సంస్థలు దృష్టిసారించాయి.
ఈ క్రమంలోనే డెలాయిట్ ఇండియా, ఎర్నెస్ట్ అండ్ యంగ్, పీడబ్ల్యూసీ, కేపీఎంజీ వంటి బడా కంపెనీలు గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ర్టాల్లోని చిన్నచిన్న నగరాల్లో వర్క్ ప్లేస్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇదిప్పుడు బెంగళూరు, హైదరాబాద్, పుణెలకూ పాకింది. సమీపంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటుచేసి ఉద్యోగులను వర్క్ ఫ్రం ఆఫీస్ విధానానికి ఆకర్షితులను చేస్తున్నాయి. పైగా ఈ నగరాల్లో నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉండటం కంపెనీలకు కలిసొస్తున్నది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలూ ఇదే బాట పడుతున్నాయి.
తెలంగాణలో వేగంగా..
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆయా కంపెనీల మనుగడకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఎప్పట్నుంచో రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో కార్పొరేట్ల పని తేలికైపోయింది. ముందుచూపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఐటీ రంగ విస్తరణకు ప్రభుత్వం బాటలు వేసిందిమరి. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్లు అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు పురోగతిలో ఉంది. నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు కానున్నాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలకు తమ ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్ ఎలా అనుకూలంగా ఉందో… అదే స్థాయిలో యావత్తు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా మారిందిప్పుడు.
ఉదాహరణకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైయెంట్, టెక్ మహీంద్రా కంపెనీలు ఇప్పటికే వరంగల్ ఐటీ హబ్లో తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఉద్యోగుల సంఖ్యను పెంచుకొని పని చేయించుకునే వెసులుబాటు ఆ కంపెనీలకు ఉన్నది. దీంతోపాటు ఇతర కంపెనీలూ ఏ జిల్లా కేంద్రంలో కావాలంటే అక్కడ వెంటనే తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంతో సిద్ధమైంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ముందుచూపుతో భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఐటీ, సేవా రంగాల విస్తరణ శరవేగంగా జరిగేందుకు పుష్కలమైన అవకాశాలు దక్కాయి.