న్యూఢిల్లీ : ఈ ఏడాది క్యాంపస్ల నుంచి 60,000 మంది మహిళా ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలని టీసీఎస్( TCS ) , ఇన్ఫోసిస్ ( Infosys ), విప్రో (WIPRO ), హెచ్సీఎల్ ( HCL ) వంటి టెక్ దిగ్గజాలు సన్నద్ధమయ్యాయి. ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను మెరుగుపరిచేందుకు క్యాంపస్ నియామకాల్లో మహిళలను పెద్ద సంఖ్యలో నియమించేందుకు కసరత్తు సాగిస్తున్నాయి.
హెచ్సీఎల్ ఈ ఏడాది చేపట్టే క్యాంపస్ నియామకాల్లో దాదాపు 60 శాతం వరకూ మహిళలనే ఎంపిక చేయాలని యోచిస్తోంది. ఎంట్రీ లెవెల్ నియామకాల్లో సగం మహిళలతో నింపాలని విప్రో, ఇన్ఫోసిస్ లక్ష్యంగా నిర్ధేశించుకున్నాయి. టీసీఎస్ సైతం ఈ ఏడాది 22,000 మంది ఫ్రెషర్స్ను క్యాంపస్ల నుంచి హైర్ చేసుకోనుండగా వారిలో సగం మంది మహిళలే ఉండేలా ప్లాన్ చేస్తోంది.
మహిళలను సంఖ్యాపరంగా నియామకాల్లో భాగంగా తీసుకోవడంతో పాటు వారికి బాసటగా నిలిచే వాతావరణం ఉండేలా టెక్ దిగ్గజాలు పలు చర్యలు చేపడుతున్నాయి. భారత్ టెక్ పరిశ్రమలో గత కొన్నేండ్లుగా తీసుకున్న చర్యల ఫలితంగా లింగ వైవిధ్యం 33 శాతంగా ఉందని నాస్కమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.