IRCTC | దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేస్ను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. అందుకోసం ఆన్లైన్ టిక్కెట్ల రిజర్వేషన్ వ్యవస్థ సామర్థ్యం పెంచనున్నది. అందుకు అవసరమైన కీలక చర్యలు తీసుకుంటామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ ద్వారా నిమిషానికి దాదాపు 25 వేల టికెట్లు జారీ చేసే సామర్థ్యం ఉంది. దీన్ని 2.25 లక్షల టికెట్ల జారీ చేసేలా అప్గ్రేడ్ చేస్తామన్నారు. వివిధ రైళ్ల రాకపోకల సమాచారం తెలిపే ఎంక్వైరీ విభాగం కెపాసిటీని 40 వేల నుంచి నాలుగు లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శుక్రవారం మీడియాకు చెప్పారు.
వచ్చే ఏడాది కొత్తగా ఏడువేల కి.మీ. పొడవునా రైల్వే ట్రాక్ నిర్మాణం చేపడతామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది రోజుకు 12 కి.మీ. చొప్పున 4,500 కి.మీ. పొడవునా రైల్వే ట్రాక్ నిర్మాణ లక్ష్యాన్ని అధిగమించామన్నారు. ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్ బ్యాకెండ్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తామన్నారు. ఐఆర్సీటీసీ టికెట్ల జారీ సామర్థ్యం నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షలకు పెంచుతామన్నారు.
దేశంలోని 2000 రైల్వే స్టేషన్ల పరిధిలో 24 గంటలు పని చేసేలా జన్ సువిధ కన్వీనియన్స్ షాపులు నిర్మిస్తామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖకు బడ్జెట్లో రూ.2.40 లక్షలు కేటాయించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.4 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. 2013-14లో జరిపిన కేటాయింపులకు ఇది తొమ్మిది రెట్లు ఎక్కువ అని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తెలిపారు.