 
                                                            దేశంలో అంతరిక్ష్య ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఇస్రో.
అయితే భారతీయ అంతరిక్ష్య పరిశోధన సంస్థ (ఇస్రో)కున్న ఈ ఘనత ఇక ఎంతోకాలం కొనసాగకపోవచ్చు.
అవును మరి. ఇస్రోను తక్కువ చేయడం కాదుగానీ.. హైదరాబాదీ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఓ వాణిజ్య రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. భారత్లో ఈ తరహా తొలి ప్రైవేట్ రాకెట్ ఇదే కావడం విశేషం.
హైదరాబాద్, అక్టోబర్ 30 : హైదరాబాద్కు చెందిన స్టార్టప్.. స్కైరూట్ ఏరోస్పేస్ ఓ అరుదైన ఘనతను సాధించబోతున్నది. దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్ను తయారుచేసి ప్రయోగించబోతున్నది. వచ్చే 3 నెలల్లో ఈ భారత తొలి ప్రైవేట్, కమర్షియల్ రాకెట్ గగనతలంలోకి దూసుకుపోవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా భారతీయ అంతరిక్ష్య పరిశోధన సంస్థ (ఇస్రో) మాత్రమే ఈ తరహా ప్రయోగాలను చేస్తున్నది. అయితే ఇక స్కైరూట్ ఏరోస్పేస్ సైతం అందుకు వేదిక కాబోతుండటం గమనార్హం.
ఇద్దరు మాజీ ఇస్రో శాస్త్రవేత్తల కంపెనీయే ఈ స్కైరూట్ ఏరోస్పేస్. వచ్చే ఏడాది జనవరిలో అంతరిక్ష్యంలోకి తమ తొలి పూర్తిస్థాయి శాటిలైట్ మిషన్ను పంపాలని స్కైరూట్ ప్రయత్నిస్తున్నది. దీంతో భారతీయ అంతరిక్ష్య పరిశోధనా రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పునాదులు పడ్డట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, టీమ్సెక్, జీఐసీ వంటి ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్నారు. అయితే వచ్చే ఏడాది ప్రతీ 3 నెలలకోసారి ఒక ప్రయోగాన్ని చేపట్టాలని స్కైరూట్ యోచిస్తున్నది. ఈ క్రమంలోనే 2027కల్లా నెలకోసారి జరుపాలనుకుంటున్నామని చెప్తున్నది.
ఒక్కో రాకెట్ నిర్మాణానికి దాదాపు 8-9 నెలల సమయం పడుతుందని, 2-3 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని స్కైరూట్ సీఈవో పవన్ చందన చెప్తున్నారు. దేశ, విదేశీ కస్టమర్ల పేలోడ్స్తో ఒక్కో ప్రయోగం ద్వారా సుమారు 5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకోవచ్చనీ అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చిన్నపాటి శాటిలైట్ల ప్రయోగాలకు డిమాండ్ పెరుగుతున్నదంటున్న స్కైరూట్.. తమ ప్రయోగాలతో ము న్ముందు భారత, అంతర్జాతీయ క్లయింట్లకు మరింత చౌకగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నది.
 
                            