హైదరాబాద్, నవంబర్ 24: దేశంలో ఈ-కామర్స్ వృద్ధిచెందడానికి ఆ రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్డీఐలు) ఆకర్షించేరీతిలో ప్రభుత్వ విధానాల్ని మరింత సరళీకరించాలని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విడుదల చేసిన నివేదికలో సూచించారు. దేశంలోకి వచ్చే ఎఫ్డీఐలపై విధానాలు సంక్లిష్టంగా ఉన్నాయని, పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీల జోక్యం అధికమని, దీంతో పలు సంస్థల నిర్వహణ, వృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని ఆ నివేదికలో వివరించారు. ఐఎస్బీకి చెందిన విధాన మేథో మండలి భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ..ఏడాదిపాటు ఆన్లైన్ రిటైల్పై నిర్వహించిన పరిశోధన ద్వారా తాజా నివేదికను రూపొందించింది. రిటైల్, ఈ-కామర్స్ రంగాల నియంత్రణ ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండాలని, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సంప్రదించి ఆ మంత్రిత్వశాఖ సరళమైన విధానాల్ని రూపొందించాలని భారతి ఇనిస్టిట్యూట్ విజ్ఞప్తిచేసింది.
చిన్న విక్రేతలకు ఆర్థిక సాయం…
చిన్న రిటైలర్లు, విక్రేతల వ్యాపారాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ఒపెన్-సోర్స్ సాఫ్ట్వేర్ అందించడంతోపాటు, ఆర్థిక సాయం లేదా తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని రిపోర్ట్ సూచించింది. చిన్న విక్రేతలు, వారి ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యమ్నాయ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటుచేసే దిశగా విధాన నిర్ణేతలు దృష్టిపెట్టాలని భారతి ఇనిస్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అవిక్ సర్కార్ కోరారు.