Akshaya Tritiya | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం.. కుటుంబ వేడుకలు, పెండ్లిండ్లూ పేరంటాలకు వీలైతే బంగారం కొనుగోలు చేస్తారు. వేడుకల్లో తమకు ఇష్టమైన ఆభరణాలు ధరించడానికి మక్కువ చూపుతారు. పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలతోపాటు పండుగల వేళ.. ధంతేరాస్, అక్షయ తృతీయ వంటి పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. అలా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఇంటికి సంపద వచ్చి చేరుతుందని భారతీయుల నమ్మకం. బంగారంతోపాటు వెండి, ఇతర విలువైన లోహాలు.. గృహోపకరణాలు కొనుగోలు చేసినా, ఇల్లు లేదా అపార్ట్మెంట్ ప్లాట్ కొనడానికి ఒప్పందం చేసుకున్నా కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుందని విశ్వాసం.
ప్రతి ఇంట్లో ఆడపిల్లల పెండ్లిండ్లకు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మున్ముందు అవసరాల కోసం ప్రతి ఒక్కరూ తమ కుటుంబ ఆర్థిక స్థోమతను బట్టి అక్షయ తృతీయ నాడు బంగారం కొంటారని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. అయితే, గత రెండు దశాబ్దాలుగా బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం..
గత నాలుగేండ్లలోనే కిందటేడాది కంటే మరుసటి ఏడాది బంగారం ధర తగ్గడం చూడొచ్చు. మిగతా అన్ని వేళ్లలో బంగారం ధర పెరగడంతో తమ సంపద పెరుగుతుందన్న సంతృప్తితోనే ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి బంగారం కొంటున్నారు. ఈ నెల 22న అక్షయ తృతీయ. ఈ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు బుకింగ్స్ జరుగుతున్నాయని బులియన్ వ్యాపారులు అంటున్నారు.
రెండు దశాబ్దాల్లో బంగారం ధర పది రెట్లకు పైగా పెరిగింది. ప్రత్యేకించి కరోనా మహామ్మారి తర్వాత గత మూడేండ్లలో ఆకాశమే హద్దు అన్నట్లు ఏడాదికేడాది ధర ‘బంగారం’ అంటూ పైపైకి దూసుకెళ్లింది. 2003లో పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.5,600 పలికింది. ఇప్పుడు రూ.62,435 పలుకుతున్నది.
బంగారం ధర పెరుగుదలకు కూడా కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ విలువ పెరిగినా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎక్కువైనా.. ఆర్థిక సంక్షోభం తలెత్తినా, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మార్గంగా బంగారాన్ని చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పుత్తడి ధర పైపైకి దూసుకెళ్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతోపాటు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల నుంచి గిరాకీ పెరగడంతో 2006లో బంగారం ధర 58 శాతం పెరిగి రూ.9630కి చేరింది. 2005లో రూ.6,100 నుంచి రూ.7000 మధ్య తచ్చాడింది. ఆ సంవత్సరమే తులం బంగారం ధర రూ.10 వేల మార్క్ను దాటినా తదుపరి కాస్త వెనక్కు తగ్గింది.
2020లో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల బంగారం ధర 47 శాతం పెరిగింది. 2019 అక్షయ తృతీయ సందర్భంగా 31,700 పలికిన తులం బంగారం ధర, 2020లో 46,527కి చేరుకున్నది. ఈ ఏడాది ఒకానొక దశలో 2020 ఆగస్టు ఏడో తేదీన రూ.55,500 ఆల్టైం రికార్డు ధర నమోదు చేసింది. కరోనా మహమ్మారి ప్రభావంతో యావత్ ప్రపంచం స్తంభించి పోయింది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, లాక్డౌన్లు, ఆంక్షల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం నిలిచింది. 2020 చివరినాటికి ఓ మోస్తరుగా ధర దిగి వచ్చింది.
సగటు భారతీయులు తమ వద్ద కుటుంబ అవసరాలకు మించి నగదు లభ్యత ఉంటే, బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. కుటుంబాల్లో హోదా ప్రదర్శనకు, ఆర్థిక స్థోమతకు చిహ్నంగా ఖరీదైన ఆభరణాలు మహిళలు ధరిస్తుంటారు. అంతర్జాతీయంగా భారత్తోపాటు చైనాలో మాత్రమే అధిక గిరాకీ ఉంటది. 2022తో పోలిస్తే తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.12వేలు పెరిగింది. ఏడాది కాలంగా అన్ని రకాల వస్తువులు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజానీకం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో గతేడాదితో పోలిస్తే ఈ దఫా అక్షయ తృతీయకు 20 శాతం గిరాకీ తగ్గుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ అంచనా వేశారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. 2022తో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.3000 (6.5 శాతం) పెరిగింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, వడ్డీరేట్లు పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు పుత్తడి ధర పెరుగుదలకు మరో కారణం. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లలో ఒత్తిళ్లు కూడా బంగారానికి గిరాకీ పెరగడానికి మరో కారణం.
ఏడాది ——- ధర (రూ.ల్లో)
2003 ——- 5,600.00
2004 ——- 5,850.00
2005 ——- 7,000.00
2006 ——- 9,600.00
2007 ——- 10,800.00
2008 ——- 12,500.00
2009 ——- 14,500.00
2010 ——- 18,500.00
2011 ——– 26,400.00
2012 ——- 31,050.00
2013 ——- 29,600.00
2014 ——- 28,006.50
2015 ——- 26,343.50
2016 ——- 28,623.50
2017 ——- 29,667.50
2018 ——- 31,438.00
2019 ——- 35,220.00
2020 ——- 55,500.00
2021 ——- 48,720.00
2022 ——- 52,670.00
2023 ——- 62,435.00