Mutual Funds | వేతన జీవులు మొదలు చిన్న వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల వరకూ ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. వాటిల్లో ముఖ్యమైనవి ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు, పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పీపీఎఫ్ తదితర స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీనిస్తుంది. ఈ పథకాల్లో పెట్టుబడులపై ఆదాయం స్థిరంగా ఉంటుంది.
సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు 7.5 శాతం వరకూ వడ్డీ రేట్ ఆఫర్ చేస్తున్నాయి. ఐదేండ్ల గడువు గల సేవింగ్స్ స్కీమ్పై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.20 శాతం వడ్డీ లభిస్తుంది. ఆయా పెట్టుబడి పథకాల్లో వచ్చే ఆదాయం.. ద్రవ్యోల్బణానికి సుమారుగా అటూ ఇటూ ఉంటుంది.
ద్రవ్యోల్బణాన్ని మించి ఆదాయం సంపాదించాలంటే ఈక్విటీ మార్కెట్లలో స్టాక్స్ కొనుగోళ్లు, మ్యూచువల్ ఫండ్ పథకాలపై ద్రుష్టి సారించాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కుర్రాళ్లు.. మధ్య వయస్సు గల యువతకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులపై రిటర్న్స్ సరిపోతాయి. వీటిల్లో సీనియర్ సిటిజన్లు పెట్టుబడులు పెట్టడానికి గల మార్గాలేమిటో తెలుసుకుందామా..!
ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నిర్వహించే పెట్టుబడి స్కీమ్ మ్యూచువల్ ఫండ్. ఉమ్మడి పెట్టుబడి లక్ష్యాన్ని షేర్ చేసుకునే పలువురు ఇన్వెస్టర్ల నుంచి డబ్బు సేకరించే సంస్థ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ట్రస్ట్గా ఉంటుంది. ఈక్విటీలు, బాండ్లు, సెక్యూరిటీ బాండ్లలో మదుపు చేస్తుంది. స్టాక్స్, బాండ్లు, ఈటీఎఫ్లు, డిబెంచర్ల వంటి సెక్యూరిటీల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడి మనీ ఉంటుంది. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే స్టాక్ మార్కెట్ల ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ వేగంగా సంపద పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాయి. మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) గానీ, ఒకేసారి గానీ పొదుపు చేయొచ్చు.
ఇతరులతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి వయస్సు ప్రధాన అవరోధంగా నిలుస్తుంది. సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ నిధులు సురక్షితంగా కాపాడుకోవడం ఒక సవాలే. ఆ నిధులకు గ్యారంటీ లభించే పథకాల్లో మదుపుతో సాధారణ ఆదాయం మాత్రమే లభిస్తుంది. కనుక సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలి.
రిస్క్లను అర్థం చేసుకుని ఆర్థిక సలహాదారుల సూచనలకు అనుగుణంగా ఇన్వెస్టర్లు తెలివిగా
పెట్టుబడి పెడితే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. రిస్క్ తగ్గించుకోవడానికి స్వల్పకాలిక డెట్ ఫండ్స్లో పెడితే.. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. తగిన సమాచారంతో ఫండ్స్ ఎంచుకుంటే ఇన్వెస్టర్లకు ఆదాయం పెరుగుతుంది.
ఎన్పీఎస్ తదితర పథకాల మాదిరిగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో నిధుల ఉపసంహరణకు పరిమితులు ఉండవు. మ్యూచువల్ ఫండ్స్లో సీనియర్ సిటిజన్లు సొంతంగా తమ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలు రూపొందించుకునేందుకు వీలు ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్దతుల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టొచ్చు. కొన్ని ఫండ్స్లో నిర్దిష్టంగా రిటర్న్స్ లభించవు. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తేనే రిటర్న్స్ లభిస్తాయి. వారి వయస్సు రీత్యా అనునిత్యం డబ్బు అవసరం అవుతుంది కనుక తగిన ఆదాయం కోసం ఎక్కువ కాలం వేచి ఉండలేరని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.