Bima Sugam సరిగ్గా ఐదేండ్ల క్రితం పాత పెద్ద నోట్ల రద్దుతో మొదలైన డిజిటల్ పేమెంట్స్.. కరోనా మహమ్మారి ప్రభావంతో 2020 నుంచి వేగం పుంజుకున్నాయి. దాదాపు ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంట్లలోనే సాగుతున్నాయి. తాజాగా కేంద్రం బీమా రంగాన్ని కూడా డిజిటలీకరించేందుకు నిర్ణయం తీసుకున్నది. మరో్వైపు ఇన్సూరెన్స్ రంగం విస్తరించడానికి, బీమా పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు.. డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ‘బీమా సుగమ్’ అనే ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయనున్నది. బీమా సుగమ్ పేరిట డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆవిర్భావంతో ఇన్సూరెన్స్ సెక్టార్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని బీమా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొవిడ్-19 మహమ్మారి వేళ.. బాధితులకు మిగిలిన చేదు అనుభవాలు.. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఎకానమీ ఒత్తిళ్లకు గురవుతున్నది. అయినా భారత్ ఇన్సూరెన్స్ రంగం మున్ముందుకే దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో బీమా రంగాన్ని బలోపేతం చేయడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని.. అందులో భాగంగా ఇన్సూరెన్స్ ఆన్ లైన్ వేదికగా ‘బీమా సుగమ్’ ఏర్పాటు చేయ తలపెట్టినట్లు ఇండియన్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అండ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది.
వివిధ ఇన్సూరెన్స్ సంస్థల పాలసీల క్రయ విక్రయాలతోపాటు అన్ని రకాల సేవలకు వేదికగా బీమా సుగమ్ నిలువనున్నది. దీని ద్వారానే బీమా క్లయిమ్లు పరిష్కారం కానున్నాయని ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా చెప్పారు. పర్సనల్ ఏజంట్స్, వెబ్ అగ్రిగేటర్స్ సహా ఇన్సూరెన్స్ రంగ మధ్యవర్తులందరికీ బీమా సుగమ్ పోర్టల్ అందుబాటులో ఉంటది. 2023 జనవరి ఒకటో తేదీ నుంచే వినియోగంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎవరైనా బీమా సుగమ్ పోర్టల్లోకి వెళ్లి నేరుగా తమకు నచ్చిన పాలసీ ఎంపిక చేసుకుని కొనుగోలు చేయొచ్చు. వివిధ బీమా సంస్థలకు చెందిన వెహికల్, పర్సనల్, హెల్త్ అండ్ యాక్సిడెంట్ తదితర ఇన్సూరెన్స్ పాలసీలు పోర్టల్లో లభ్యం అవుతాయి. ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన ఉంటే నేరుగా తమకు అవసరమైన పాలసీ ఎంచుకోవచ్చు. అలా కానీ పక్షంలో ఏజంట్లు, మధ్యవర్తులను సంప్రదించి సేవలు పొందొచ్చు. నేరుగా బీమా పాలసీ ఎంచుకునే వారికి బీమా సుగమ్ గుడ్ ఆల్టర్నేటివ్ అవుతుంది.
దేశంలోని సుమారు 70 బీమా సంస్థల్లో లక్షల మంది ఏజంట్లు, అగ్రిగేటర్లు, టెలికాలర్లు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి ఉపాధి అవకాశాలు దెబ్బ తినకుండా బీమా సుగమ్ వేదికను విజయవంతం చేయడం ఐఆర్డీఏఐకి పెద్ద సవాల్ కానున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం దేశంలో బీమా రంగం 6.5 శాతానికి పైగా గ్రోత్ రేట్ తో ముందుకు సాగుతున్నది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే నెలాఖరు నాటికే జీవిత బీమా ప్రీమియంలు రూ.8.25 లక్షల కోట్లు దాటతాయని ఒక అంచనా. ఇన్సూరెన్స్ సెక్టార్లో లైఫ్ ఇన్సూరెన్స్ వాటా ఇప్పటికీ 70 శాతం ఉంటది. ఇదే గ్రోత్ కొనసాగితే వచ్చే ఎనిమిదేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరో ఇన్సూరెన్స్ వ్యవస్థ గల దేశంగా భారత్ నిలుస్తుంది.
అంత విస్త్రుత అవకాశాలు గల బీమా రంగ వినియోగదారులకు మెరుగైన అవగాహన కల్పించడానికి ఒక మంచి వేదికగా బీమా సుగమ్ తీర్చిదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్ విజయం సాధించినట్లే బీమా రంగంలో బీమా సుగమ్ సక్సెస్ అవుతుందని ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండ ధీమా వ్యక్తం చేశారు.