న్యూఢిల్లీ, మార్చి 6: పాలసీదారుల రక్షణ, బీమా రంగంలో నమ్మకాన్ని పెంచడానికి తాజాగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (ఐఆర్డీఏఐ).. బీమా సంస్థలు అనుసరిస్తున్న ఆర్థిక నివేదిక విధివిధానాల్లో మార్పుల్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే వచ్చే నెల ఏప్రిల్ మొదలు భారతీయ అకౌంటింగ్ స్టాండర్డ్స్ను అన్ని బీమా కంపెనీలు పాటించాలన్నది.
జీవిత బీమా, జనరల్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, రీఇన్సూరర్లు అందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ బీమా రంగ ఆర్థిక నివేదికలు ఉండాలని ఐఆర్డీఏఐ అంటున్నది. దీనివల్ల పారదర్శకత, ఆర్థిక ప్రకటనల్లో నిజాయితీ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
కాగా, ఈ ముసాయిదా ప్రతిపాదనపై పాలసీదారులు, బీమా సంస్థలు, పరిశ్రమ సంఘాలు, నిపుణులు, ఆడిటర్లు ఇతరత్రా వర్గాల నుంచి అభిప్రాయాలనూ ఐఆర్డీఏఐ కోరింది. ఇదిలావుంటే ఐఆర్డీఏఐ ప్రతిపాదనతో పాలసీదారులు తమ బీమా సంస్థల ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీనివల్ల కంపెనీలపై కస్టమర్లలో విశ్వాసం కూడా పెరుగుతుందని చెప్తున్నారు. బీమా సంస్థల్లో ఆర్థిక అవకతవకలకూ చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.