న్యూఢిల్లీ, ఆగస్టు 2: సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు వార్షిక ఖర్చులకు పగ్గంవేస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ముసాయిదా మార్గదర్శకాలు జారీచేసింది. ఒక ఏడాదిలో కంపెనీ విక్రయించిన స్థూల ప్రీమియంలో 30 శాతానికి మించి నిర్వహణా వ్యయాల కోసం ఖర్చు చేయరాదని పేర్కొంది. కమీషన్లు, బ్రోకరేజ్/రెమ్యునరేషన్, ఏజెంట్లు, ఇంటర్మీడియరీలకు ప్రోత్సాహకాలు తదితర నిర్వహణా వ్యయాలన్నీ ఈ పరిమితికి లోబడే ఉండాలని ఐఆర్డీఏఐ తెలిపింది. అయితే పీఎంఎస్బీవై, పీఎంజేఏవై, పీఎంఎఫ్బీవై తదితర గ్రామీణ ప్రాంతపు స్కీములకు అదనపు అలవెన్స్లు కేటాయించుకోవచ్చని సూచించింది. ఈ అలవెన్స్ ప్రీమియం వార్షిక వృద్ధిలో 10 శాతాన్ని మించరాదన్నది. టెక్నాలజీ, విస్త్రత పంపిణీ వ్యవస్థ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ ఖర్చుల్ని నియంత్రించడం ఆహ్వానించదగ్గ పరిణామమేనని, పాలసీ హోల్డర్లకు ఇది శ్రేయస్కరమని ఒక సాధారణ బీమా కంపెనీ సీఈవో చెప్పారు.