IRDAI | బీమా పాలసీల సరెండర్ విలువ ఖరారు కోసం రూపొందించిన నిబంధనల అమలుపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) వెనుకడుగు వేసింది. ఇన్సూరెన్స్ సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడమే దీనికి కారణం. బీమా పాలసీల సరెండర్ విలువ పెంచడం వల్ల పాలసీదారులు మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని బీమా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. బీమా పాలసీ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే ముగించినప్పుడు సదరు ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించే మొత్తాన్నే సరెండర్ విలువ అని అంటారు.
పాలసీ గడువు ఉండగానే మధ్యలోనే పాలసీదారు సరెండర్ చేస్తే, వారికి వచ్చిన ఆదాయం, పొదుపు చేసిన మొత్తం చెల్లిస్తారు. ఎక్కువ కాలం పాలసీ కొనసాగిస్తే ఎక్కువ సరెండర్ విలువ ఉంటుంది. మూడేండ్ల లోపు పాలసీలు సరెండర్ చేస్తే వాటి విలువ యథాతథంగా లేదా తక్కువ ఉండే అవకాశం ఉంది. నాలుగు నుంచి ఏడేండ్ల లోపు సరెండర్ చేస్తే స్వల్పంగా విలువ పెరుగుతుంది. తొలుత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సరెండర్ విలువ ఖరారుపై సవరించిన నిబంధనలు అమలు చేయాలని భావించినా.. బీమా సంస్థల అభ్యంతరాల నేపథ్యంలో ఐఆర్డీఏఐ వెనక్కు తగ్గింది.