Railway Ticket Booking | నిత్యం రైలు ప్రయాణాలు చేసే వారికి, పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారికి భారతీయ రైల్వేస్ శుభవార్త అందించింది. ఆన్లైన్ టికెట్ల బుకింగ్ పరిమితి పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ ద్వారా, దాని యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ పరిమితి పెంచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక యూజర్ ఐడీ (ఆధార్ లింక్ కాదు) ద్వారా నెలలో గరిష్ఠంగా ప్రయాణ టికెట్ల బుకింగ్ పరిమితి ఆరు నుంచి 12కు పెంచింది. ఆధార్ లింక్డ్ యూజర్ ఐడీ ద్వారా 12 నుంచి 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు సాధారణ యూజర్ ఐడీ ద్వారా నెలలో ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు అనుమతి లభించేది. ఒకవేళ ఏదైనా శుభకార్యానికి కుటుంబం అంతా కలిసి వెళ్లాలన్నా.. పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా.. అందరికీ టికెట్లు బుక్ చేసుకోవడం అంటే ఒకటి కంటే ఎక్కువ యూజర్ ఐడీలు క్రియేట్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకునేవారు. ఆధార్ లింక్డ్ యూజర్ ఐడీతో 12 నుంచి 24 టికెట్లు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు లభించడంతో ఒక్క ఐడీతోనే కుటుంబ సభ్యులందరికి టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలు కలిగింది.
ప్రయాణికులు తమతోపాటు అతిగా బ్యాగేజీ తీసుకెళ్లొద్దని ఇటీవల ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రైల్వేస్ హితవు చెప్పింది. లగేజీ ఎక్కువగా ఉంటే ఎంజాయ్ చేయలేరని, అదనపు బ్యాగేజీ ఉంటే ఆఫీసుకు పార్సిల్ చేయడం గానీ, లగేజీ బుకింగ్ ద్వారా తీసుకెళ్లాలని సూచించింది. ఒకవేళ అవసరానికి మించిన లగేజీ ఉందని భావిస్తే.. విమాన ప్రయాణం మాదిరిగా రైల్వే ప్రయాణంలోనూ నగదు చెల్లించాల్సి ఉంటుందని రైల్వేశాఖ విధానాన్ని ప్రకటించింది.
ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోల వరకు ఉచితం. ఏసీ2-టైర్లో 50 కిలోలు, ఏసీ 3-టైర్ స్లీపర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్ల్లో 40 కిలోల బ్యాగేజీ వరకు అనుమతి ఇస్తారు. క్లాస్-2 ప్రయాణికులు 25 కిలోలు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. లగేజీపై కనిష్ఠ చార్జీ రూ.30గా ఖరారు చేశారు.