న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏకమొత్తంగా విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఇప్పటివరకూ ఫలించకపోవడంతో స్టాక్ మార్కెట్లో ప్రస్తుత అధిక విలువకు ట్రేడవుతున్న న్యూటెక్నాలజీ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)ను సొమ్ముచేసుకోవడానికి సిద్ధమయ్యింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ఐఆర్సీటీసీలో స్టాక్ ఎక్సేంజీల్లో 5 శాతం వాటాను (4 కోట్ల షేర్లు) విక్రయిస్తున్నది. షేరుకు రూ.680 చొప్పున ఫ్లోర్ ధరగా నిర్ణయించారు. బుధవారం నాటి మార్కెట్ ధర రూ.733.50 కంటే 7 శాతంపైగా తక్కువకే ఓఎఫ్ఎస్లో షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నది. ఈ ధర ప్రకారం కేంద్ర ఖజానాకు కనీసం రూ. 2,720 కోట్లు సమకూరనున్నాయి.
ఈ ఏడాది పీఎస్యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని కేంద్ర బడ్జెట్లో నిర్దేశించుకోగా, ఇప్పటివరకూ ఎయిర్ ఇండియా అమ్మకం ద్వారా ఒనగూడిన మొత్తంతో సహా రూ.23,000 కోట్లు మాత్రమే సమీకరించుకోగలిగింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ద్రవ్యలోటు లక్ష్యం 6.4 శాతం మించకుండా ఉండాలంటే ఏదో విధంగా వచ్చే మూడు నెలల్లో రూ.65,000 కోట్లు సమకూరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐఆర్సీటీసీ వాటా అమ్ముతున్నట్టు హఠాత్తుగా ప్రకటన వెలువడింది.
నేడు, రేపు ఆఫర్
బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో డిసెంబర్ 15, 16 తేదీల్లో ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయం జరుగుతుందని ఐఆర్సీటీసీ బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఎక్సేంజీల్లో ప్రత్యేక విండోలో విక్రయ ఆఫర్ అమలవుతుందని, రెండు రోజుల్లోనూ బిడ్డింగ్ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై 3.30 గంటలకు ముగుస్తుందని పేర్కొంది. డిసెంబర్ 15న నాన్-రిటైల్ ఇన్వెస్టర్లు వారి బిడ్స్ను సమర్పించవచ్చని, ఆ బిడ్స్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఆ మరుసటి రోజున సవరించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ఐఆర్సీటీసీ వివరించింది. రిటైల్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 16న బిడ్స్ వేయవచ్చని తెలిపింది.