IRCTC-Araku Package | ఆంధ్రా ఊటీగా అరకు లోయ ప్రసిద్ధి. ఆ లోయలో అందాలు వీక్షిస్తూ.. తమను తామే మైమరిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. కేవలం అరకు అందాలే కాదు.. విశాఖపట్నం నుంచి అరకు వరకూ వెళ్లే రైలు ప్రయాణం.. అందులో ప్రయాణించే ప్రయాణికులకు సరికొత్త అనుభూతులు మిగులుస్తుంది. సొరంగాలు, వంతెనల మీదుగా ప్రకృతి ద్రుశ్యాలను వీక్షిస్తూ సాగే ఈ జర్నీ జీవితాంతం గుర్తుండి పోతుంది. అంతటి అనుభూతి.. అపురూప జ్ఞాపకాలను మిగిల్చే అరకు లోయకు ఒక్కరోజులోనే వెళ్లి చూసి రావడానికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్యాకేజీ అందిస్తోంది. విశాఖ నుంచి అరకు వెళ్లేందుకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంటుంది. రైలు కం రోడ్డు మార్గంలో ప్రయాణించేలా ఈ ప్యాకేజీ ఉంటుంది. వీకెండ్లో కొత్త ప్రదేశాన్ని చూడాలనుకుంటే ఈ ప్యాకేజీపై ఒక లుక్ వేయొచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందు రోజే విశాఖ పట్నానికి చేరుకోవాలి.
ప్రతి రోజూ ఉదయం 6.45 గంటలకు విశాఖ పట్నం నుంచి రైలు బయలుదేరుతుంది. సొరంగాలు, వంతెనల మీదుగా సాగే రైలు.. 10.55 గంటలకు అరకులోయకు చేరుతుంది. అరకు రైల్వే స్టేషన్ నుంచి ముందు అరకు లోయకు వెళ్లి.. అక్కడి అందాలు వీక్షించి.. ఆదివాసీ మ్యూజియం, చాపరాయి గార్డెన్స్ సందర్శించిన తర్వాత విశాఖకు బస్సులో ప్రయాణం అవుతారు. ఈ బస్సు ప్రయాణంలో అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహాలను వీక్షిస్తారు. విశాఖ రైల్వే స్టేషన్ లేదా సిటీ శివారుల్లోకి చేరడంతో మీ ప్రయాణం ముగుస్తుంది.
అరకు టూర్ వెళ్లడానికి రైలు టికెట్లు ప్యాకేజీని బట్టి .. అంటే ఎకానమీ లేదా స్లీపర్ క్లాస్ టికెట్లు ఇస్తారు. సందర్శన స్థలాల వీక్షణకు ఏసీ బస్సు ఫెసిలిటీ ఉండదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్.. సాయంత్రం తేనీరు తదితర వసతులు ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. బొర్రా గుహల సందర్శన రుసుము ప్యాకేజీలో అంతర్భాగమే. మిగతా ప్రదేశాల్లో ఎంట్రన్స్ ఫీజు మొదలు ఫొటోలు, వీడియో చార్జీలు ప్రయాణికులే పే చేయాలి. ఇక ఈ ప్రయాణ ప్యాకేజీకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటది.
బడ్జెట్ క్యాటగిరి (సెకండ్ క్లాస్) లో పెద్దలకు రూ.2,130.., పిల్లలకు (5-11 ఏండ్ల లోపు) రూ.1,760 పే చేయాలి. స్టాండర్డ్ క్యాటగిరీలో పెద్దలు రూ.2385, పిల్లలు రూ.1915 పే చేయాలి. ఎగ్జిక్యూటవ్ చైర్ కార్లో పెద్దలకు రూ.4,450, పిల్లలకు రూ.4080 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకుంటే 15 రోజుల ముందు సమాచారం ఇచ్చిన వారికి రూ.250 మినహా మొత్తం చార్జీలు చెల్లిస్తుంది ఐఆర్సీటీసీ. నాలుగు రోజుల ముందు తెలిపితే మాత్రం చెల్లించిన ప్రయాణ చార్జీలు తిరిగి ఇవ్వరు.