IRCTC | ఆన్లైన్లో రైల్వే టికెట్ల రిజర్వేషన్ సేవలందిస్తున్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) త్వరలో పేమెంట్స్ రంగంలోకి రానున్నది. పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ సన్నాహాలు చేస్తున్నది. పేమెంట్ అగ్రిగేటర్గా ఐఆర్సీటీసీ మారేందుకు మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో కొత్త నిబంధన చేర్చనున్నారు. పేమెంట్ అగ్రిగేటర్గా మారేందుకు గత నెల 26న జరిగిన ఐఆర్సీటీసీ వార్షిక సమావేశంలో ఆమోదం లభించింది. రైల్వేశాఖ సైతం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. ఇందుకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆమోదం పొందిన ఐఆర్సీటీసీ.. త్వరలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి దరఖాస్తు చేయనున్నది.
నాన్-బ్యాంక్ పేమెంట్ అగ్రిగేటర్లు.. పేమెంట్స్ సేవలందించడానికి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్-2007, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంవోఏ) కింద ఆర్బీఐ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆర్బీఐకి ఐఆర్సీటీసీ దరఖాస్తు చేయడంతోపాటు ఆమోదం పొందడానికి కొంత సమయం పట్టనున్నదని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే రైలు, బస్సు, విమాన ప్రయాణ టికెట్లు, టూర్ ప్యాకేజీ టికెట్ల బుకింగ్కు ఐఆర్సీటీసీ ఇంటర్నల్ పేమెంట్ గేట్వే `ఐ-పే (I-PAY)`గా వ్యవహరిస్తున్నది. ఐఆర్సీటీసీకి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. దీనికి భారీ యూజర్ల పునాది ఉంది. ఐఆర్సీటీసీ యూజర్లంతా దాన్ని తమ పేమెంట్స్ సేవలకు ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపవచ్చు.
ఆర్బీఐ ఆమోదం పొందగానే ఇతర పేమెంట్స్ అగ్రిగేటర్ సంస్థల, మర్చంట్ల మాదిరిగానే.. ఐఆర్సీటీసీ కూడా వివిధ రకాల పేమెంట్స్ సర్వీసులు.. అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తెస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) మార్గదర్శకాలకు అనుగుణంగా మున్సిపల్ టాక్స్లు, యుటిలిటీ బిల్లులు, మొబైల్ ఈ-కామర్స్ వెబ్ ఆధారిత సేవలు, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తుంది.