IPO Rush | ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ఐపీవో రష్ కొనసాగుతోంది. సోమవారం నుంచి పలు సంస్థలు, స్టార్టప్లు నిధుల సేకరణకోసం స్టాక్మార్కెట్లలో ఐపీవోకు వెళ్లనున్నాయి. ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం ఐపీవో సోమవారం ప్రారంభం అవుతుంది. కేఎఫ్సీ, పిజ్జాహట్ ఔట్లెట్ల నిర్వాహక సంస్థ సఫైర్ ఫుడ్స్ ఇండియా, లాటెంట్ వ్యూ అనలిటిక్స్ కూడా ఐపీవోలకు వెళ్లనున్నాయి.
ఈ మూడు సంస్థలు ఐపీవోల ద్వారా రూ.21 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యం పెట్టుకున్నాయి. సోమవారం పేటీఎం, సఫైర్ ఫుడ్స్ ఇండియా ఈ నెల 9న, లేటెంట్ వ్యూ అనలిటిక్స్ ఈ నెల 10 ఐపీవోకు వెళతాయి. పేటీఎం అత్యధికంగా రూ.18,300 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ముందుకెళుతున్నది.
గతవారం ఐదు సంస్థల ఐపీవోలు విజయవంతంగా ముగిసాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 46 కంపెనీలు ఐపీవో ద్వారా రూ.80,102 కోట్ల సేకరణకు వెళ్లనున్నాయి. ఇది రూ.లక్ష కోట్ల చేరువలోకి వెళుతుందని అంచనా.
ఇక పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ పవర్ గ్రిడ్ ఇన్వ్ ఐటీ రూ.7,735 కోట్లు, బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ రూ.3,800 కోట్ల నిధులు సేకరించాయి. ఇంతకుముందు 2017లో 36 సంస్థలు అత్యధికంగా ఐపీవోల ద్వారా రూ.67,147 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. గతేడాది 15 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ.26,611 కోట్ల నిధులు సేకరించాయి.