LIC IPO | ఐపీవో ద్వారా ఎల్ఐసీ స్టాక్మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నది. కార్పొరేట్ గవర్నెన్స్ నియంత్రణ నిబంధనలను పాటించడం కోసం ఎల్ఐసీలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది. కేంద్ర ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి అంజులీ చిప్ దుగ్గల్, సెబీ మాజీ సభ్యుడు జీ మహాలింగం, ఎస్బీఐ లైఫ్ మాజీ ఎండీ సంజీవ్ నైటియాల్, చార్టర్డ్ అకౌంటెంట్ ఎంపీ విజయ్ కుమార్, రాజ్కుమార్, వీఎస్ పార్థసారధిలను నమించినట్లు సమాచారం. దీంతో ఎల్ఐసీలో తొమ్మిది మంది స్వతంత్ర డైరెక్టర్ల నియామకం ప్రక్రియ పూర్తయినట్లేనని భావిస్తున్నారు.
ఈ వారంలో ఎల్ఐసీ ఐపీవోకు అనుమతించాలని సెబీ ముందు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పత్రాలను సమర్పించనున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంతా పాండే చెప్పారు. ఎంబీడెడ్ ఎల్ఐసీ విలువ రూ.5 లక్షల పై చిలుకే ఉండవచ్చునని సమాచారం. సెబీ ఆమోదం లభిస్తే వచ్చేనెలలో ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లను తాకుతుందని తెలుస్తున్నది. పాలసీ దారులకు 10శాతం వాటాలను ఎల్ఐసీ ఐపీవోలో రిజర్వు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.78 వేల కోట్ల రెవెన్యూ అంచనాలను చేరుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ లిస్టింగ్ కీలకం కానున్నది. ఎయిరిండియా ప్రైవేటీకరణ, ఇతర సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.12 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఎల్ఐసీ ఐపీవో సజావుగా సాగేందుకు సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని గత వారం ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. సంస్థ ఎండీల్లో ఒకరైన రాజ్కుమార్ పదవీ కాలాన్నీ మరో 12 నెలలు పొడిగించింది.