iPhone 15 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) తన ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లను ‘వండర్ లస్ట్’ వేదికగా ‘ఆపిల్ పార్క్’లో ఆవిష్కరించనున్నది. కాలిఫోర్నియా టైం ప్రకారం ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలు) ఆపిల్ టీవీ యాప్, ఆపిల్ డాట్ కాం వేదికగా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఐ-ఫోన్ 15 సిరీస్లో ఐ-ఫోన్15, ఐ-ఫోన్15 ప్లస్, ఐ-ఫోన్15 ప్రో, ఐ-ఫోన్15 ప్రో మ్యాక్స్ అనే పేర్లతో మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న ఆవిష్కరించినా.. భారత్లో కొన్ని రోజుల తర్వాత సేల్స్ ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.
భారత్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి మొబైల్ ఫోన్లు, లాప్ టాప్లు, సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరర్లకు కేంద్రం పలు ఇన్సెంటివ్లు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. దేశీయంగా సెల్ ఫోన్ల ఉత్పత్తితోపాటు ఉత్పత్తి, పంపిణీ రంగంలో స్థానికులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి.
మేక్ ఇన్ ఇండియా స్కామ్ కింద ఆపిల్ దేశంలోనే ‘ఐ-ఫోన్15’ ఫోన్లు తయారు చేస్తుందని తెలుస్తుంది. చెన్నైలోని ఆపిల్ అసెంబ్లింగ్ కాంట్రాక్ట్ సంస్థ ఫాక్స్కాన్ యూనిట్లో ఉత్పత్తి చేస్తారని భావిస్తున్నారు.
గతేడాది ఐ-ఫోన్14 ఆవిష్కరించిన 10 రోజుల్లో భారత్లో తయారైన ఐ-ఫోన్లు ప్రపంచవ్యాప్త సేల్స్ కోసం పంపిణీ అయ్యాయి. ఇదిలా ఉంటే, దేశీయంగా ఉత్పాదకతను పెంచడానికి విదేశాల నుంచి లాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. తొలుత ఆగస్టు తొలి వారం నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చినా.. కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులకు మూడు నెలల క్లియరెన్స్ టైం లభించింది. విదేశాల నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్ కలిగి ఉండాలి. ఆయా లైసెన్సులు జారీ చేయడానికి కూడా కొంత టైం పడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.