iPhone 15 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. తన ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. శుక్రవారం నుంచి భారత్లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. స్థానికంగా పారిశ్రామిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. ‘మేడిన్ భారత్’ విధానం అమలు చేస్తోంది. దేశీయంగా ఫోన్లు తయారు చేస్తున్న నేపథ్యంలో భారతీయ కస్టమర్లు ధరలు తగ్గుతాయని సహజంగా ఆశిస్తారు. కానీ ఆపిల్ ఆశలపై నీళ్లు చల్లింది.. ఎందుకో తెలుసుకుందామా..!
ఆపిల్ ఐ-ఫోన్లు భారత్ లో కేవలం అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఐ-ఫోన్15 మాత్రమే అసెంబ్లింగ్ జరుగుతున్నది. కానీ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్లు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
దిగుమతి అవుతున్న ఐ-ఫోన్ 15 ప్రో మోడల్ ఫోన్లపై కేంద్రం 22 శాతం దిగుమతి సుంకం, రెండు శాతం సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీతోపాటు అదనంగా 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నది. అంటే భారత్లో ఐ-ఫోన్ 15 ప్రో మోడల్ ఫోన్లపై వసూలు చేస్తున్న పన్నులు దాదాపు 40 శాతం ఉంటాయి.
ఐ-ఫోన్ 15 పరిస్థితి స్వల్పంగా భిన్నం. కొన్ని విడి భాగాలు దిగుమతి అవుతున్నాయి. భారత్ లో అసెంబ్లీంగ్ చేస్తున్నారు. తైవాన్ ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్.. చెన్నైకి సమీపంలోని శ్రీ పెరంబదూర్ ప్లాంట్లో వీటిని అసెంబ్లింగ్ చేస్తున్నది.
ఐ-ఫోన్లోని అన్ని విడి భాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే కనుక సుంకం వడ్డింపు తప్పనిసరి. ఉదాహరణకు ఐ-ఫోన్ డిస్ ప్లే శాంసంగ్ తయారు చేస్తున్నందున 20 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. సర్క్యూట్ బోర్డులు, ట్రాన్సిస్టర్లు, ప్రాసెసర్లపైనా దిగుమతి సుంకం వసూలు చేస్తారు.. వీటికి అదనంగా 18 శాతం జీఎస్టీ వడ్డింపు ఉంటుంది.. ఫలితంగా ఐ-ఫోన్ 15 ఫోన్ ధర కాస్త ఎక్కువే ఉంటుంది.