న్యూఢిల్లీ, నవంబర్ 17: స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పాటు సరళతర ద్రవ్య విధానం కారణంగా అధిక ధరలకు జారీ అయిన ఐపీవోల్లో పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లు భారీ నష్టాల్ని చవిచూశారు. డిజిటల్ కంపెనీలుగా మార్కెట్ దృష్టిని ఆకర్షించిన పేమెంట్స్ సంస్థ పేటీఎం, డెలివరీ స్టార్టప్ జొమాటో, బ్యూటీ ఈ-రిటైలర్ నైకా, లాజిస్టిక్స్ సంస్థ డెల్హివరీ, ఆన్లైన్ ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ పాలసీ బజార్ షేర్లు వాటి లిస్టింగ్ ధరలతో పోలిస్తే ఇప్పుడు నిలువునా పతనమయ్యాయి.
ఈ ఐపీవోలు లిస్టయిన తర్వాత 16 నెలల్లో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల నష్టాన్ని ఇన్వెస్టర్లకు మిగిల్చాయి. పేటీఎం మాత్ర సంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ షేరు గురువారం 10 శాతం పతనమై రూ.540 వద్దకు దిగింది. పేటీఎంలో ఇన్వెస్ట్చేసిన సాఫ్ట్బ్యాంక్ వాటాల్ని విక్రయిస్తున్న వార్తలు ఇందుకు కారణం. అలాగే జొమాటోలో ప్రారంభ పెట్టుబడులు చేసిన ఉబర్ టెక్నాలజీస్ వాటాను ఉపసంహరించుకోవడంతో ఈ షేరు రూ.67 స్థాయికి పడిపోయింది. బ్యూటీ ఉత్పత్తుల ఈ-రిటైలింగ్ చేసే నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ నుంచి తొలినాళ్లలో ఇన్వెస్ట్చేసిన ఇన్వెస్టర్లకు లాకిన్ సమయం ముగియడంతో భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. దీంతో ఈ షేరు కేవలం 15 రోజుల్లోనే 30 శాతం వరకూ నష్టపోయింది. పాలసీ బజార్ పేరెంట్ కంపెనీ పీబీ ఫిన్టెక్దీ ఇదే పరిస్థితి. ఏడాది క్రితం సాధించిన రికార్డుస్థాయి నుంచి 70 శాతం విలువను కోల్పోయింది. లాజిస్టిక్స్ స్టార్టప్ డెల్హివరీ షేరు నాలుగు నెలల్లో సగమై పోయింది.